ACB raids on Kallepalli Srinivasa Rao
-
పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాసరావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దాడులు
-
విశాఖ, సాలూరు, హైదరాబాద్లో ఏకకాల సోదాల్లో రూ.30 కోట్ల ఆస్తుల గుర్తింపు
-
బంగారం, నగదు, భూములు, వాహనాలు స్వాధీనం చేసుకొని శ్రీనివాసరావును ఏసీబీ అరెస్ట్
రిటైర్డ్ ఎస్ఈ కల్లేపల్లి శ్రీనివాసరావుకు సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు విశాఖ సహా ఐదు ప్రాంతాల్లో సోదాలు చేసి సుమారు రూ.30 కోట్ల ఆస్తులను గుర్తించారు.
పంచాయతీరాజ్ శాఖలో భారీ అవినీతిపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు, రిటైర్డ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కల్లేపల్లి శ్రీనివాసరావు కు చెందిన ఇళ్లపై ఒకేసారి సోదాలు చేపట్టారు.
ఐదు ప్రాంతాల్లో ఏకకాల రైడ్స్
విశాఖపట్నం మధురవాడలోని నివాసంతో పాటు సాలూరు, హైదరాబాద్ శేరిలింగంపల్లి ప్రాంతాల్లో మొత్తం ఐదు చోట్ల ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.
భూములు, బంగారం, నగదు స్వాధీనం
సోదాల్లో మధురవాడలో జీవి వద్ద రూ.2 కోట్ల విలువైన రెండు ప్లాట్లు, శివాజీపాలెం–మధురవాడలో రూ.2 కోట్ల విలువైన రెండు ఇళ్ల స్థలాలు బయటపడ్డాయి. అలాగే సాలూరులో కుమార్తె పేరు మీద 18.57 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదే కాకుండా సుమారు 2.5 కేజీల బంగారం (రూ.4 కోట్లు), 20.3 కేజీల వెండి (రూ.50 లక్షలు), రూ.61.87 లక్షల నగదు, హ్యుందయ్ కారు, బైక్, గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాంక్ లాకర్ల కీలు… అరెస్ట్
తనిఖీల్లో మరో ఐదు బ్యాంక్ లాకర్ల తాళాలు లభించాయి. వీటిపై మరింత విచారణ కొనసాగుతోంది. సోదాల అనంతరం శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన గతేడాది డిసెంబర్ 31న ఎస్ఈగా పదవీవిరమణ పొందినట్లు అధికారులు తెలిపారు.