ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉపాధ్యాయుల హాజరుపై తాజాగా కఠినమైన నిబంధనలు అమలు చేసేందుకు ఉత్తర్వులు విడుదల చేసింది. బడులకు సమయానికి రాని టీచర్లపై, సమయానికి ముందే వెళ్లిపోయే వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ తాజా నిబంధనలు అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది ప్రభుత్వ పాఠశాల టీచర్లపై నేరుగా ప్రభావం పడుతుంది. బయోమెట్రిక్ హాజరు విధానం కఠినంగా అమలు చేయాలని, దానిలో ఎలాంటి రాజీ ఉండదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది.
లేట్ ఇన్ నిబంధనలు పూర్తి వివరాలు
ఉదయం 9 గంటల తర్వాత పాఠశాలకు వచ్చే టీచర్లను లేట్ ఇన్గా పరిగణిస్తారు. 10 నిమిషాల గ్రేస్ పీరియడ్ నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమే వర్తిస్తుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చే వారు మధ్యాహ్నం ఒంటి గంట లోపు రావాలి. ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్ ఇన్గా పరిగణిస్తారు. ఈ నిబంధనలు ఆంధ్రప్రదేశ్లోని అన్ని రకాల పాఠశాలలకు వర్తిస్తాయని అధికారులు తెలిపారు.
ఏర్లీ ఔట్ నిబంధనలు ఒక్క నిమిషం ముందైనా నేరమే
ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటలకు ఒక నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్గా పరిగణిస్తారు. ఉప ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటలకు ఒక్క నిమిషం ముందు వెళ్లినా ఏర్లీ ఔట్గా నమోదవుతుంది. ఉదయం పాఠశాలకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టిన వారు 12.30 గంటల కంటే ముందుగా ఔట్ టైం నమోదు చేస్తే వేగంగా వెళ్లిపోయినట్లు పరిగణిస్తారు. ఒక్క నిమిషం తేడా కూడా లెక్కిస్తారు కాబట్టి టీచర్లు జాగ్రత్తగా ఉండాలని ఏపీ విద్యాశాఖ హెచ్చరించింది.
ఇన్ టైం నమోదు చేసి ఔట్ టైం నమోదు చేయకపోతే?
ఎవరైనా ఉదయం ఇన్ టైం నమోదు చేసి ఔట్ టైం నమోదు చేయకపోతే ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లిపోయినట్లుగా పరిగణిస్తారని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నిబంధన టీచర్లు బయోమెట్రిక్ హాజరులో తప్పుగా నమోదు చేసే అవకాశాన్ని పూర్తిగా తొలగించేందుకు రూపొందించారు. ఈ కఠిన నిబంధనలపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాలు స్పందించాల్సి ఉంది.
ఇంకా చదవండి: Ugadi Job Bonanza 2026: 1,14,899 పోస్టులతో ఏపీ జాబ్ క్యాలెండర్… నిరుద్యోగులకు బిగ్ రీలీఫ్?