ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి వినూత్న నిరసనతో వార్తల్లో నిలిచారు. ఇటీవల ఉపాధి హామీ కూలీగా మారి నిరసన తెలిపిన ఆమె, ఇప్పుడు అరటి రైతుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి ట్రక్కు డ్రైవర్గా మారడం విశేషం.
కడపలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో, అరటి గెలలు లోడ్ చేసిన వాహనాన్ని స్వయంగా నడుపుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ను కలిసి రైతుల తరఫున వినతిపత్రం సమర్పించారు.
రాజకీయ పరంగాను విమర్శలు..
ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల, అరటి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తీవ్రంగా ప్రస్తావించారు. కడప జిల్లాలో సరైన కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు లేక రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేసి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదని పేర్కొన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అరటి పంటను ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి, పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇక రాజకీయ విమర్శల పరంగా కూడా షర్మిల వెనక్కి తగ్గలేదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీపై ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించామన్న ప్రకటనలు నిజం కాదని ఆరోపించారు.
ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టులను ప్రారంభించి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపిస్తూ, తాను వ్యక్తులపై కాకుండా ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు.
వారు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు..
అదేవిధంగా విజయమ్మ లేఖపై జరుగుతున్న రాజకీయ వివాదాన్ని కూడా ప్రస్తావిస్తూ, అది సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని వ్యాఖ్యానించారు.
తాను వైసీపీ నేతలను దూషించలేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని అన్నారు. మొత్తంగా, అరటి రైతుల సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, అన్ని రాజకీయ పార్టీలు రైతుల పక్షాన నిలవాలని వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు.
Also read: మిర్చి రేటు డబుల్ జంప్… రైతులకు బంగారు కాలం!


