హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పండగ సందడి మొదలవుతున్న వేళ పసిడి ప్రియులకు షాక్ తగిలింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, యుద్ధ మేఘాల మధ్య మార్చి 18న ధరలు మళ్లీ పుంజుకున్నాయి.
ధరల పెరుగుదలకు కారణాలేంటి?
సాధారణంగా యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో బంగారం ధరలు పెరగాలి. అయితే, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం వంటి కారణాలతో ఇటీవల ధరలు భారీగా తగ్గాయి. ఫిబ్రవరి 28 నుంచి చూస్తే తులం బంగారంపై దాదాపు రూ. 12,000 వరకు తగ్గుదల కనిపించింది. కానీ, వరుస పతనం తర్వాత మార్కెట్ నేడు మళ్లీ కోలుకుంది.
నేటి బంగారం ధరల వివరాలు (హైదరాబాద్ మార్కెట్):
22 క్యారెట్ల బంగారం: 10 గ్రాములపై రూ. 600 పెరగడంతో, ప్రస్తుతం దీని ధర రూ. 1,44,900 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం: తులంపై రూ. 660 పెరిగి, ప్రస్తుతం రూ. 1,58,080 వద్ద ట్రేడవుతోంది.
వెండి ధర కూడా పైపైకే..
బంగారం బాటలోనే వెండి ధర కూడా పరుగులు తీస్తోంది. హైదరాబాద్లో కేజీ వెండి ధర నేడు ఏకంగా రూ. 4,000 పెరిగింది.
ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2.80 లక్షల వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 5,000 డాలర్ల వద్ద, వెండి 79 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి విలువ రూ. 92.42 వద్ద ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల దృష్ట్యా, ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత దేశీయ ధరల్లో మళ్లీ స్వల్ప మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.