Dubbaka Congress Internal Conflicts
-
దుబ్బాక కాంగ్రెస్లో చెరుకు శ్రీనివాస్రెడ్డి, డాక్టర్ పన్యాల శ్రవణ్రెడ్డి మధ్య విభేదాలు పార్టీని తీవ్రంగా బలహీనపరుస్తున్నాయి.
-
నాయకత్వ లోపం, గ్రూపు రాజకీయాల కారణంగా క్యాడర్లో అయోమయం ఏర్పడి ఎన్నికల ఫలితాల్లో ప్రతికూల ప్రభావం పడుతోంది.
-
అధిష్టానం జోక్యం లేకపోతే రాబోయే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ చర్చనీయాంశంగా మారుతోంది. ఒకప్పుడు దివంగత నేత చెరుకు ముత్యంరెడ్డి పేరు వినగానే గుర్తుకొచ్చే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన నేతల మధ్య విభేదాలు, గ్రూపు రాజకీయాలు పార్టీని బలహీనపరుస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా, మంత్రిగా దుబ్బాక ప్రజల మన్ననలు పొందిన చెరుకు ముత్యంరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన చెరుకు శ్రీనివాస్రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్నా, తండ్రి లెగసీని నిలబెట్టలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చెరుకు శ్రీనివాస్రెడ్డిపై విమర్శలు:
- గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
- నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదగలేకపోయారనే అభిప్రాయం స్థానికంగా ఉంది.
- తండ్రి స్థాయి ప్రజాదరణను అందుకోలేకపోవడం కాంగ్రెస్ క్యాడర్లో నిరాశకు కారణమైంది.
డాక్టర్ పన్యాల శ్రవణ్రెడ్డి రూటే వేరు..
- హస్తం పార్టీకి చెందిన మరో కీలక నేత డాక్టర్ పన్యాల శ్రవణ్రెడ్డి నియోజకవర్గంలో ఎక్కువగా కనిపించరనే ఆరోపణలు ఉన్నాయి.
- హైదరాబాద్, కర్నాటక ప్రాంతాల్లో ఎక్కువ సమయం గడుపుతారని కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు.
- ఎన్నికల సమయంలో మాత్రమే టికెట్ కోసం చురుకుగా ఉంటారని, మిగతా సమయాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండరని విమర్శలు.
- ఓటు వేసేందుకు కూడా నియోజకవర్గానికి రారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్యాడర్లో అయోమయం :
- చెరుకు శ్రీనివాస్రెడ్డి, పన్యాల శ్రవణ్రెడ్డి మధ్య సఖ్యత లేకపోవడం కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తోంది.
- ఒక నాయకుడిని కలిస్తే మరొకరు టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు.
- ఇద్దరి మధ్య విభేదాల కారణంగా పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి.
- గ్రూపు రాజకీయాలు పార్టీని బలహీనపరుస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.
ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలం
తెలంగాణ ఏర్పాటయ్యాక జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించింది. ఒక ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందగా, కాంగ్రెస్ ఉనికి తగ్గుముఖం పట్టింది. ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికల్లో 141 స్థానాల్లో బీఆర్ఎస్ 85 గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 30 స్థానాలకే పరిమితమైంది. ఈ ఫలితాలకు నాయకుల అంతర్గత విభేదాలే కారణమని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధిష్టానం ఆగ్రహం?
- రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఘోర పరాజయం పార్టీ హైకమాండ్ దృష్టిని ఆకర్షించినట్లు సమాచారం.
- నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
- ఎన్నికల సమయంలో మాత్రమే చురుకుదనం చూపి, తర్వాత నిర్లక్ష్యం వహిస్తున్నారని లోకల్ నేతలు మండిపడుతున్నారు.
భవిష్యత్తుపై ఆందోళన :
- పటిష్టమైన క్యాడర్ ఉన్నప్పటికీ సరైన నాయకత్వం లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.
- చెరుకు శ్రీనివాస్రెడ్డి, శ్రవణ్రెడ్డి తీరులో మార్పు రాకపోతే పార్టీ మరింత బలహీనపడే ప్రమాదం ఉందని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
- రాబోయే మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో మరిన్ని అపజయాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నాయి.
దుబ్బాకలో ఒకప్పుడు అజేయ శక్తిగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంతర్గత కలహాలతో క్షీణిస్తున్న దృశ్యం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాయకత్వంలో సమన్వయం లేకపోతే ఈ పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.