శామీర్పేట్ (మేడ్చల్ మల్కాజిగిరి): తన రాజకీయ ప్రస్థానంపై వస్తున్న ఊహాగానాలకు బిజెపి నేత, ఎంపీ ఈటల రాజేందర్ గారు గట్టి కౌంటర్ ఇచ్చారు. పార్టీలు మారడం అంటే బట్టలు మార్చినంత సులభం కాదని, తాను ఎప్పటికీ ధర్మాన్ని, ప్రజలను నమ్ముకున్న వాడినే తప్ప సోషల్ మీడియా ప్రచారాలను కాదని స్పష్టం చేశారు. సోమవారం శామీర్పేట్ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కేసీఆర్ నన్ను ఇబ్బంది పెట్టని రోజూ లేదు:
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఐదేళ్లు అవుతున్నా, ఇప్పటికీ తనపై కుట్రలు జరుగుతున్నాయని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.
కక్ష సాధింపు: “కేసీఆర్ తన సర్వశక్తులూ ఒడ్డి నన్ను ఇబ్బంది పెట్టారు. నా కోళ్ల ఫారాలను కూల్చారు, లీగల్ గా కొనుక్కున్న భూములను గుంజుకున్నారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రికి లేఖ రాస్తాను” అని వెల్లడించారు.
గురువు తప్పు చేశారు: ఈటల లాంటి వ్యక్తిని పోగొట్టుకుని కేసీఆర్ పెద్ద తప్పు చేశారని ప్రజలే చర్చించుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు.
పార్టీ మార్పుపై క్లారిటీ:
తాను కాంగ్రెస్లోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు.
కమిట్మెంట్ ముఖ్యం: “గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పిలిచి మంత్రి పదవి ఇస్తామన్నా వెళ్లలేదు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే కాంగ్రెస్లోకి వెళ్లేవాడిని, అప్పుడు మంత్రి లేదా డిప్యూటీ సీఎం అయ్యేవాడిని. కానీ నేను ధర్మం వైపే ఉంటాను” అని తేల్చి చెప్పారు.
పార్టీ వ్యూహం: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచే వారికే టిక్కెట్లు ఇస్తామని, ‘నా వాడు.. నీ వాడు’ అనే భేదాలు ఉండవని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన అబద్ధాల మీద సాగుతోందని ఈటల ధ్వజమెత్తారు.
బక్వాస్ మాటలు: “గత ప్రభుత్వం దోచుకున్నది కక్కిస్తామని చెప్పిన రేవంత్, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు? భూములు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదు. కోర్టులను కూడా మేనేజ్ చేసే స్థాయికి వెళ్లారు” అని విమర్శించారు.
చలో బాలాజీ నగర్: ఎంపీలుగా, ఎమ్మెల్యేలతో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతామని, అందులో భాగంగా ‘చలో బాలాజీ నగర్’ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు.
ఇతర కీలక అంశాలు:
నియోజకవర్గాల పునర్విభజన: దీనివల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని ప్రధాని మోదీ గారే స్వయంగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ సమస్యపై అక్కడి ప్రజలు పిలిస్తే వెళ్లి నాయకత్వం వహిస్తానని హామీ ఇచ్చారు.
CSR నిధులు: పార్లమెంట్ పరిధిలోని సమస్యలు, సీఎస్ఆర్ నిధుల వినియోగంపై ప్రధానికి లేఖ రాసినట్లు తెలిపారు.
Also Read: యుద్ధం ప్రభావం.. తెలంగాణలో బీరు, మద్యం ధరలు పెంచే సూచనలు.. మే నుంచి కొత్త రేట్లు?


