- హైదరాబాద్కు 20 టీఎంసీల అదనపు నీటి సరఫరా
- గోదావరి ఫేజ్-2&3 ప్రాజెక్టు పనులకు వేగం
- మల్లన్న సాగర్, ఘనపూర్ వద్ద నిర్మాణాల పరిశీలన
హైదరాబాద్ నగరానికి 20 టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి, మూసీ పునరుజ్జీవనం కోసం, జంట జలాశయాలను గోదావరి నీటితో నింపడానికి రూ.7,360 కోట్ల వ్యయంతో.. గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ -2&3 ప్రాజెక్టు రా వాటర్ పంప్ హౌస్ నిర్మాణ పనులలో వేగం పెంచాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రాజెక్టులో భాగంగా మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద నిర్మించనున్న పంప్ హౌస్ ప్రారంభ పనులను పరిశీలించారు.
Also Read: ‘యుఫోరియా’ సినిమా ప్రెస్ మీట్లో ఏడ్చేసిన భూమిక
మల్లన్న సాగర్ వద్ద పంప్ హౌస్ పరిశీలన
మల్లన్న సాగర్ రిజర్వాయర్ ట్యాపింగ్ పాయింట్ కు సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రా వాటర్ పంపింగ్ హౌస్ నిర్మాణానికి అనుగుణంగా చేపట్టే ప్రారంభం పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
పంపు హౌస్ కి సంబంధించిన సాంకేతిక వివరాలను తెలుసుకున్నారు. ఈ పంపింగ్ హౌస్ నుంచి ఘనపూర్ వరకు దాదాపు 50 కిలోమీటర్ల రెండు వరుసల 3000 ఎంఎం డయా పైపు లైను సంబంధించిన నిర్మాణ పనులు పరిశీలించారు.
ఘనపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు
ఘనపూర్ మాస్టర్ రిజర్వాయర్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద రా వాటర్ ను శుద్ధి చేసి నగరానికి తరలిస్తారు.
గజ్వేల్ మండలంలోని పాతూరు గ్రామ సమీపం వద్ద పైపు లైను నిర్మాణ పనులను ఎండీ పరిశీలించారు. వెల్డింగ్ పనుల నాణ్యత, మన్నిక వివరాలను కార్మికులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు.
పైపులైన్ భద్రత, జియో ట్యాగింగ్ ఆదేశాలు
ఈ సందర్భంగా ప్రతి పైపుకు యూనిక్ నెంబర్ ను కేటాయించి ప్రతి పైపుని జియో ట్యాగ్ చేయాలని.. దీనికోసం ఐటీ విభాగ అధికారుల సాయంతో ప్రత్యేక మొబైల్ యాప్ ను రూపొందించేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పైపులైన్ల జాయింట్ల పటిష్టతను ప్రత్యేకమైన ఫ్లా డిటెక్టర్(అల్ట్రా సోనిక్ టెస్ట్) పరికరంతో పరీక్షించి సంతృప్తి చెందారు.
టైమ్లైన్ ప్రకారం పనులు పూర్తి చేయాలన్న సూచన
అనంతరం ఘనపూర్ వద్ద నిర్మిస్తున్న 1170 ఎమ్మెల్డీల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిని పరిశీలించారు. టైమ్ లైన్లకు నిర్దేశించుకున్న పనులు పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. దీనికి అవసరమైతే రెండు షిఫ్టుల్లో పనులు జరిగేలాగా చూసుకోవాలని అన్నారు. అవసరమైతే అదనపు గ్యాంగ్ లను నియమించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ టీవీ శ్రీధర్, సీజీఎమ్ మహేష్ కుమార్, ప్రాజెక్ట్ వింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.