తిరుపతి టికెట్ల పేరుతో కరీంనగర్‌లో భారీ మోసం.. విశ్రాంత ఉద్యోగి ఖాతా నుంచి రూ.18.46 లక్షలు కాజేసిన పూజారి

తిరుపతి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని విశ్రాంత ఉద్యోగి ఫోన్ తీసుకున్న పూజారి 30 విడతల్లో రూ.18.46 లక్షలు కొట్టేశాడు. బ్యాంకుకు వెళ్తే అకౌంట్లో డబ్బులు లేవని తెలిసి బాధితుడికి షాక్.

Karimnagar temple priest fraud
Karimnagar temple priest fraud

కరీంనగర్: దేవుడి గుడిలో పరిచయమైన మనిషే మోసం చేశాడు. రోజూ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటున్న అమాయక ముసలాయన్ని నమ్మించి, ఫోన్ తీసుకుని, 30 విడతల్లో రూ.18.46 లక్షలు కాజేసిన పూజారి ఇప్పుడు పరారీలో ఉన్నాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్వారం గ్రామంలో జరిగిన ఈ మోసం వివరాలు తెలిసి అందరూ నివ్వెరపోతున్నారు.

పరిచయం నుండి మోసం వరకు

ఓద్వారం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి రోజూ దర్శనానికి వెళ్తున్న ఒక విశ్రాంత ఉద్యోగికి అక్కడ పూజారిగా పని చేస్తున్న సాయి తరుణ్‌తో పరిచయం ఏర్పడింది. రోజూ కలుస్తూ మాట్లాడడంతో ఆయన సాయి తరుణ్‌ను నమ్మకమైన వ్యక్తిగా భావించారు. ఒకసారి తిరుపతి దర్శనానికి వెళ్లాలని అనుకున్న బాధితుడికి సాయి తరుణ్ తానే టికెట్లు బుక్ చేస్తానని ముందుకొచ్చాడు. ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేస్తానని చెప్పాడు. నమ్మకంగా ఫోన్ అందించాడు బాధితుడు. అదే చివరికి పెద్ద తప్పయింది.

రోజూ ఫోన్ తీసుకుని డబ్బులు కొట్టేశాడు

ఫోన్ చేతికి వచ్చిన సాయి తరుణ్ పాస్‌వర్డ్ తెలుసుకున్నాడు. మెసేజ్‌లు బాధితుడికి కనిపించకుండా సెట్టింగ్‌లు మార్చాడు. తర్వాత రోజూ టికెట్ల పేరు చెప్పి ఫోన్ తీసుకుంటూ, బాధితుడి అకౌంట్ నుండి దామెర హరీష్ అనే వ్యక్తికి డబ్బులు పంపాడు. ఉదయం 9 గంటల లోపే రోజూ రూ.99,999 ట్రాన్స్‌ఫర్ చేసేవాడు – బ్యాంక్ అలర్ట్‌లు రాకుండా చేసేందుకు ఈ తెలివైన పద్ధతి వాడాడు. ఇలా మొత్తం 30 విడతల్లో రూ.18.46 లక్షలు కాజేశాడు.

బ్యాంకుకు వెళ్తే అకౌంట్ ఖాళీ

డబ్బు అవసరమై బ్యాంకుకు వెళ్లిన బాధితుడికి అకౌంట్‌లో డబ్బులు లేవని అధికారులు చెప్పారు. నివ్వెరపోయిన ఆయన స్టేట్‌మెంట్ తీసి చూశారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల లోపు రూ.99,999 బదిలీ అయినట్లు కనిపించింది. అప్పుడు అర్థమైంది — తిరుపతి టికెట్ల పేరు చెప్పి ఫోన్ తీసుకున్న పూజారే మోసం చేశాడని. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఒకరు అదుపులో, పూజారి పరారీ

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. డబ్బులు అందుకున్న దామెర హరీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు నిందితుడు సాయి తరుణ్ మాత్రం పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

దేవుడి ఆలయంలో పరిచయమైన వ్యక్తిని నమ్మి మోసపోయిన ఈ కేసు — ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులు ఫోన్ ఇతరులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. పాస్‌వర్డ్ ఎవరికీ చెప్పవద్దని, బ్యాంక్ మెసేజ్‌లు రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

Also Read: రాజమండ్రిలో కల్తీ పాలు విషాదం – మృతుల సంఖ్య పెరుగుతోంది

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »