LIVE

Telangana Live Updates – తెలంగాణ తాజా వార్తలు, హైదరాబాద్ అప్‌డేట్స్

Telangana Live Updates (06 March 2026): తెలంగాణ బ్రేకింగ్ న్యూస్, హైదరాబాద్ తాజా వార్తలు, రాజకీయాలు, జిల్లాల అప్‌డేట్స్ అన్నీ ఒకే చోట.

Telangana Live updates
Telangana Live updates
  • 06 Mar 2026 08:40 PM (IST)

    మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక హామీ – నిర్వాసితులకు అన్యాయం చేయమని స్పష్టం

    మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధిలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని సీఎం Revanth Reddy హామీ ఇచ్చారు.

    మూసీ నదిలో ప్రస్తుతం చెత్త, మురికి ఎక్కువగా పేరుకుపోయిందని, అలాంటి వాతావరణంలో జీవించాలనేది ఎవరికీ ఇష్టం ఉండదని అన్నారు.

    రంగారెడ్డి జిల్లా కొత్వాల్‌గూడలో ఎకో పార్క్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వ్యాపారాలకు అవకాశాలు పెంచుతామని తెలిపారు.

    అభివృద్ధి పనుల్లో కొందరు భూమి కోల్పోయే పరిస్థితి ఉండొచ్చని, అయితే నిర్వాసితులతో చర్చించి వారికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు.

  • 06 Mar 2026 06:44 PM (IST)

    RTCలో డిజిటల్ సౌకర్యం – ‘MEE TICKET’ యాప్‌తో ఈజీ టికెట్ బుకింగ్

    గ్రేటర్ హైదరాబాద్‌లో దూరప్రాంతాలకు ప్రయాణించే వారు మరియు సాధారణ బస్‌పాస్ వినియోగదారులు ‘MEE TICKET’ మొబైల్ యాప్ ద్వారా సులభంగా టికెట్లు బుక్ చేసుకోవచ్చని RTC గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ తెలిపారు.

    MEE TICKET
    MEE TICKET

    ప్రస్తుతం నగరంలో 42 అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కేంద్రాల ద్వారా అన్ని రకాల బస్‌పాస్‌లు అందిస్తున్నామని చెప్పారు. అయితే బస్‌పాస్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణికులు యాప్ ద్వారా సులభంగా టికెట్లు, బస్‌పాస్ సేవలను పొందవచ్చని ఆయన సూచించారు.

  • 06 Mar 2026 06:35 PM (IST)

    HYDలో లంచాల గోల – GHMC ఆఫీసులో రెడ్‌హ్యాండెడ్‌గా అకౌంట్స్ ఎగ్జామినర్ పట్టుబాటు!

    హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ GHMC కార్యాలయంలో లంచం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అకౌంట్స్ ఎగ్జామినర్ సంతోష్ ఓ పెన్షనర్ వద్ద నుంచి రూ.35 వేల లంచం తీసుకుంటుండగా ACB అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫైల్ కదలాలంటే లంచం తప్పదనే పరిస్థితి కార్యాలయాల్లో కొనసాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    అయితే ఇది కేవలం చిన్న ఉదాహరణ మాత్రమేనని, GHMC ఇంజినీరింగ్ విభాగంలో 30 శాతం వరకు కమీషన్ దందా నడుస్తోందని పలువురు అంటున్నారు.

    చిన్న స్థాయి ఉద్యోగులను పట్టుకుని హడావిడి చేస్తున్నారని, వందల కోట్ల ఆస్తులు కూడబెట్టిన పెద్ద అధికారులపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి ఫైళ్లు ఇప్పటికీ బీరువాల్లోనే మగ్గుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

  • 06 Mar 2026 06:35 PM (IST)

    రంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీ కేంద్రంలో అగ్నిప్రమాదం – గ్యాస్ సిలిండర్ లీక్‌తో వ్యాపించిన మంటలు!

    రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలంలో అంగన్వాడీ కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొందుర్గు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం-1లో వంట పనులు జరుగుతున్న సమయంలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.

    దీంతో అక్కడ ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు.

    ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అంగన్వాడీ కేంద్రంలోని కొన్ని వస్తువులు మంటల్లో దగ్ధమైనట్లు సమాచారం. అధికారులు ఘటనపై విచారణ చేపట్టి గ్యాస్ లీకేజీకి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

  • 06 Mar 2026 06:30 PM (IST)

    హైదరాబాద్‌లో ఆకాశమే హద్దుగా హోర్డింగ్‌లు – సైలెంట్‌గా 15 ఫీట్ లిమిట్ ఎత్తేసిన సర్కార్!

    హైదరాబాద్‌లో హోర్డింగ్‌ల హడావుడి మళ్లీ మొదలైంది. అడ్వర్టైజ్‌మెంట్ పాలసీలో తాజాగా చేసిన మార్పులతో నగరంలో భారీ యాడ్ బోర్డులు ఏర్పాటు చేసే దారులు తెరుచుకున్నాయి. గత ఆరు సంవత్సరాలుగా అమల్లో ఉన్న 15 అడుగుల ఎత్తు పరిమితిని ప్రభుత్వం సైలెంట్‌గా ఎత్తివేసినట్లు సమాచారం. దీంతో GHMC, CMC, MMC పరిధిలో ఇక ఆకాశమే హద్దుగా భారీ హోర్డింగ్‌లు వెలిసే అవకాశముంది.

    ఈ మార్పులతో ప్రధానంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే లాభం చేకూరుతుందని విమర్శలు వినిపిస్తున్నాయి. టెండర్ నిబంధనలను కూడా పెద్ద సంస్థలకు అనుకూలంగా మార్చారని చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు ఆరోపిస్తున్నాయి. భారీ పెట్టుబడులు పెట్టగలిగిన కంపెనీలే ఇప్పుడు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయించే పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

    ఇంకా ఐదేళ్ల కాంట్రాక్టుల పేరుతో నగరానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడేలా నిర్ణయాలు తీసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అధికారికంగా పెద్దగా ప్రకటనలు లేకుండానే పాలసీ మార్పులు అమల్లోకి రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో నగర అందం, ట్రాఫిక్ భద్రతపై కూడా ప్రభావం పడుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • 06 Mar 2026 05:57 PM (IST)

    Engineering Colleges Fees: తెలంగాణ ప్రభుత్వం కొత్త ఫీజులు ఖరారు

    తెలంగాణలో ప్రైవేట్ అన్‌ఏడెడ్ ఇంజినీరింగ్ కాలేజీలలో B.E./B.Tech కోర్సుల ట్యూషన్ ఫీజులను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హయ్యర్ ఎడ్యుకేషన్ (టెక్నికల్ ఎడ్యుకేషన్) శాఖ 04 మార్చి 2026న G.O. Ms. No. 06 జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం 2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు కొత్త ఫీజులు అమల్లో ఉంటాయి.

    ఈ జాబితాలో హైదరాబాద్‌లోని ప్రముఖ కాలేజీ చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) అత్యధిక ట్యూషన్ ఫీజుతో మొదటి స్థానంలో నిలిచింది. CBITలో B.Tech కోర్సుల వార్షిక ట్యూషన్ ఫీజు ₹1.83 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

    రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు ఫీజు నిర్మాణాన్ని ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త ఫీజులు ఫీజు రెగ్యులేటరీ కమిటీ సిఫార్సుల ఆధారంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు కాలేజీ వారీగా ఫీజుల వివరాలు త్వరలో స్పష్టంగా అందుబాటులోకి రానున్నాయి.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »