ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్లు, రైతు బజార్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ మార్కెటింగ్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం ద్వారా సహజ పూల విక్రయాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ పూల మార్కెట్లు, రైతు బజార్లలో ఇకపై ప్లాస్టిక్ పూలను విక్రయించేందుకు అనుమతి ఉండదు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే సంబంధిత వ్యాపారులపై జరిమానాలు విధించడమే కాకుండా, వారి లైసెన్సులను కూడా రద్దు చేసే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులకు ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
రైతుల ఆవేదనతో..
ఈ నిర్ణయం వెనుక రైతుల ఫిర్యాదులు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇటీవల రైతు మేళాల్లో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వద్ద రైతులు తమ సమస్యలను వెల్లడి చేశారు. మార్కెట్లలో సహజ పూలకు డిమాండ్ తగ్గిపోవడానికి ప్లాస్టిక్ పూలే కారణమని, దీని వల్ల తమకు నష్టాలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలను గమనించిన మంత్రి వెంటనే స్పందించి, మార్కెట్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలను అనుమతించవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో మార్కెటింగ్ శాఖ ఈ నిషేధ ఉత్తర్వులను అమల్లోకి తీసుకువచ్చింది.
ప్లాస్టిక్ నిర్మూలన దిశగా..
ఇకపోతే, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపడుతోంది. పేపర్, వస్త్రం, జనపనారతో తయారు చేసే సంచులను వినియోగించేందుకు ప్రజలను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై పూర్తి నిషేధం విధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. దీనికోసం చట్ట సవరణల ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్లాస్టిక్ పూలపై నిషేధ నిర్ణయాన్ని రైతులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. తమ సమస్యను గుర్తించి పరిష్కారం చూపినందుకు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం సహజ పూల సాగుకు ఊతమివ్వడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also read:


