తెలంగాణ రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల మార్చి 22న రైతు భరోసా పథకం (Rythu Bharosa Scheme) కింద మొదటి విడత నిధులను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సిద్దిపేట జిల్లా నర్మెట్ట వేదిక కానుంది. అక్కడి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేయనున్నారు.
ప్రభుత్వ అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు భూమి కలిగిన సుమారు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో మొదటి విడతగా రూ.3,590 కోట్లకు పైగా నిధులు జమ కానున్నాయి. ఈ మొత్తాన్ని నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతుల పంట ఖర్చులకు తక్షణ ఉపశమనం కలిగించడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది.
First installment of Rythu Bharosa funds to be released on March 22.
•Honourable Chief Minister Sri A @revanth_anumula will release the Rythu Bharosa funds from Narmetta in Siddipet district.
•The Chief Minister held discussions with Deputy Chief Minister Mallu Bhatti…— Jacob Ross (@JacobBhoompag) March 15, 2026
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ప్రత్యేకంగా సమావేశమై పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం మొదటి విడత అనంతరం దాదాపు 20 రోజుల వ్యవధిలో రెండో విడతగా మరో రూ.2,650 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అనంతరం మిగిలిన రైతులకు కూడా ఏప్రిల్ నెలాఖరు లోపు నిధులు చేరేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
మొత్తం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.50 కోట్ల ఎకరాలకు సంబంధించిన రైతులకు కలిపి రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు ఈ దఫా విడుదల కానున్నాయి. వ్యవసాయ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిధులు రైతులకు గణనీయమైన మద్దతు అందిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
తెలంగాణలో రైతు సంక్షేమానికి సంబంధించిన పథకాలు రాజకీయంగా కూడా కీలక అంశంగా మారాయి. గతంలో అమలులో ఉన్న రైతు బంధు పథకానికి భిన్నంగా, రైతు భరోసా పథకం ద్వారా రైతుల అవసరాలకు అనుగుణంగా నిధులను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, పంట సంరక్షణ ఖర్చులు పెరిగిన సమయంలో ఈ ఆర్థిక సాయం రైతులకు ఉపశమనం కలిగిస్తుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కొనుగోలు శక్తి పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది మేలు చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. అందుకే ఈ నిధుల విడుదలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కీలక కార్యక్రమంగా భావిస్తోంది.
Also Read: రైతులకు 24 గంటల కరెంట్ కాదు… 12 గంటలే వస్తోంది: హరీశ్ రావు