ఫిబ్రవరి 24 ఉద్రిక్తత? టీజీఎస్ఆర్టీసీ బస్సులు ఆపేస్తామన్న హెచ్చరిక

ఫిబ్రవరి 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి అడ్డంకులు కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిపి విధులు బహిష్కరిస్తామని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ హెచ్చరించింది.

Telangana bus strike
Telangana bus strike

తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 24న నిర్వహించనున్న “చలో సెక్రటేరియట్” కార్యక్రమాన్ని అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే నిలిపివేసి విధులు బహిష్కరించాల్సి వస్తుందని టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

ఈ మేరకు జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివచ్చే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈదురు వెంకన్న తెలిపారు.

ఇది మా ఆత్మగౌరవ పోరాటం. ఇది మా ఆకలి పోరాటం. మా శ్రమ దోపిడీపై పోరాటం. మా శ్రమకు తగ్గ ఫలితం కోసం పోరాటం, అని ఆయన పేర్కొన్నారు.

ఈ నిరసన కార్యక్రమాన్ని పూర్తిగా శాంతియుతంగా, గాంధేయ మార్గంలో నిర్వహించనున్నామని జేఏసీ స్పష్టం చేసింది.

ఇందిరా పార్క్‌కు రాకుండా అడ్డుకోవద్దు

ఫిబ్రవరి 24న రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి ఆర్టీసీ ఉద్యోగులు హైదరాబాద్ చేరుకుని ఇందిరా పార్క్‌లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అడ్డంకులు సృష్టించకూడదని జేఏసీ కోరింది.

ఆర్టీసీ కార్మికుల గోసలు, గోడులు ప్రభుత్వం వినాలి. మా ఆక్రందనలు చూసి ప్రభుత్వం స్పందించాలి. దీన్ని భగ్నం చేసే ప్రయత్నం చేయవద్దు, అని ఈదురు వెంకన్న విజ్ఞప్తి చేశారు.

బస్సులు నిలిపివేత హెచ్చరిక

ఒకవేళ నిరసనలను అడ్డుకునే ప్రయత్నం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిపివేసి విధుల బహిష్కరణకు పిలుపునివ్వాల్సి వస్తుందని జేఏసీ స్పష్టం చేసింది.

ఇది అమలైతే ప్రజా రవాణా వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటివరకు ప్రభుత్వ అధికారిక స్పందన వెలువడలేదు. అయితే భవిష్యత్తులో ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తుందా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

ఫిబ్రవరి 24 కార్యక్రమం విజయవంతమవుతుందా? లేక ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »