హైదరాబాద్: అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. సంక్షేమ పథకాలపై తప్పుడు ప్రచారం చేస్తే ‘చెప్పు తెగుతుంది’ అని మంత్రి సీతక్క ఇచ్చిన వార్నింగ్పై బీఆర్ఎస్ నేత వై. సతీశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి అహంకారంతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
సతీశ్ రెడ్డి విసిరిన సవాళ్లు ఇవే:
1. 5G ఫోన్ల స్థానంలో 4G ఎందుకు?:
అంగన్వాడీ టీచర్లకు ఆధునిక 5G మొబైల్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబితే, రాష్ట్ర ప్రభుత్వం కాలం చెల్లిన 4G ఫోన్లను ఎందుకు పంపిణీ చేసిందని సతీశ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కొనుగోలు వ్యవహారంలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన పునరుద్ఘాటించారు.
2. సీబీఐ విచారణకు సిద్ధమేనా?:
“అంగన్వాడీ ఫోన్ల స్కామ్ను బీఆర్ఎస్ బయటపెట్టడంతోనే మంత్రి సీతక్క ఫ్రస్ట్రేషన్లో ఊగిపోతున్నారు. మీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే ఈ కొనుగోళ్లపై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించండి” అని ఆయన సవాలు విసిరారు.
3. ఆధారాలతోనే కొడతాం:
మంత్రి ‘చెప్పు’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “మాకు చెప్పులతో పనిలేదు, మేము పక్కా ఆధారాలతోనే కొడతాం. అవినీతిని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు” అని కౌంటర్ ఇచ్చారు.
4. కాంగ్రెస్ – బీజేపీ కుమ్మక్కు:
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, అందుకే ఇలాంటి భారీ కుంభకోణాలపై కేంద్ర సంస్థలు విచారణ చేపట్టడం లేదని ఆయన ఆరోపించారు. ఒకరినొకరు కాపాడుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
Also Read:


