ఎగ్జిబిటర్ పర్సంటేజ్ వివాదం.. పరిష్కారానికి రంగంలోకి తెలుగు ఫిలిం ఛాంబర్

తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఎగ్జిబిటర్ పర్సంటేజ్ వివాదం (Tollywood percentage issue)పై తెలుగు ఫిలిం ఛాంబర్ (Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యకు పరిష్కారం కోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

TFI | తెలుగు సినీ పరిశ్రమలో కొంతకాలంగా కొనసాగుతున్న ఎగ్జిబిటర్ పర్సంటేజ్ వివాదంపై తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న భేధాభిప్రాయాలకు సఖ్యతతో పరిష్కారానికి ప్రత్యేక సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఫిలింనగర్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల థియేటర్లకు తగ్గుతున్న ప్రేక్షకాదరణ, విడుదలైన కొద్ది రోజులకే సినిమాలు ఓటీటీలోకి రావడం, రెంటల్–పర్సంటేజ్ విధానాలపై భిన్నాభిప్రాయాలు వంటి అంశాలు పరిశ్రమలో చర్చకు దారితీశాయి.

ఈ నేపథ్యంలో సమస్యలను సమగ్రంగా చర్చించి పరిష్కార మార్గాలు సూచించేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు ఛాంబర్ వర్గాలు తెలిపాయి. ఈ సబ్ కమిటీకి నిర్మాత, ఛాంబర్ అధ్యక్షుడు డీ సురేష్ బాబు చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. సీనియర్ నిర్మాత అల్లు అరవింద్, మాజీ అధ్యక్షుడు దిల్ రాజు, కేఎల్ నారాయ‌ణ మార్గదర్శకత్వంలో కమిటీ పనిచేయనుంది. ఛాంబర్ గౌరవ కార్యదర్శి కే అశోక్ కుమార్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల విభాగాల నుంచి సభ్యులను కమిటీలోకి తీసుకున్నారు. పరిశ్రమలో కొనసాగుతున్న సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించాలని, అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళ్లాలని కమిటీ నిర్ణ‌జ్ఞించింది.

నిర్మాతల విభాగం నుంచి క‌మిటీలో..

వై సురేందర్ రెడ్డి
వై సుప్రియా
వై రవిశంకర్
బీ బాపినీడు
చెరుకూరి సుధాకర్
జీ శ్రీనివాస్ కుమార్ (ఎస్‌కేఎన్)
టీ ప్రసన్న కుమార్

ఎగ్జిబిటర్ విభాగం నుంచి..

వీ ప్రతాప్ రెడ్డి
టీ బాలగోవింద్ రాజ్
కే అనుపమ్ రెడ్డి
పీ శ్రీనివాస్ రావు
జీ వీరనారాయణ బాబు
కే వంశీ కిషోర్ (చిన్ని)
ఎం విజయేందర్ రెడ్డి

డిస్ట్రిబ్యూటర్ విభాగం నుంచి..

డీ విష్ణుమూర్తి
వీ వీరినాయుడు
ఎన్ సుధాకర్ రెడ్డి
ముత్యాల రాందాస్
ఎన్ నాగార్జున
బీ మధుసూదన్ రెడ్డి (ఠాగూర్ మధు)
ధీరజ్ మొగిలినేని

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »