టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా వివాహం ఇటీవల రాజస్థాన్లోని జైపూర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. వివాహానంతరం నాగర్కర్నూల్ జిల్లాలోని విజయ్ స్వగ్రామం తుమ్మన్పేటలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలో నిర్మించిన తమ ఫామ్ హౌస్లో ఈ వ్రతాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించిన విజయ్ దంపతులు, అనంతరం ఊర్లోని ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. గ్రామస్థులందరినీ ఆహ్వానించి సత్కరించడం స్థానికంగా ప్రశంసలు అందుకుంది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల ఆధారంగా గ్రామస్థులకు నాన్వెజ్ వడ్డించారనే చర్చ మొదలైంది.
వ్రతం రోజున నాన్వెజ్ వడ్డించాలా?
కొంతమంది ఆంధ్రా ప్రాంత నెటిజన్లు సత్యనారాయణ స్వామి వ్రతం రోజున సాధారణంగా శాకాహారమే వడ్డిస్తారని, అలాంటి సందర్భంలో మాంసాహారం ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు. వ్రతం రోజున శుచిగా ఉండి, దేవుడికి చేసే నైవేద్యాలు, ప్రసాదాలు అన్నీ శాకాహారంతోనే ఉండాలని వారు అభిప్రాయపడుతున్నారు.
Also Read: స్వగ్రామం తుమ్మన్పేటలో సందడి… విజయ్ దేవరకొండ–రష్మిక దంపతులకు ఘన స్వాగతం
అయితే దీనికి తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వారి వాదన ప్రకారం సత్యనారాయణ స్వామి వ్రతం కుటుంబ సభ్యులు నిర్వహించే పూజ. గ్రామస్థులందరికీ ఆ వ్రతంతో ప్రత్యక్ష సంబంధం ఉండదు. ఇంటి లోపల పూజా కార్యక్రమాలు సంప్రదాయం ప్రకారం శాకాహారంతోనే నిర్వహిస్తే సరిపోతుందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్రతం పూర్తయ్యాక, పీఠాన్ని కదిలించిన తర్వాత లేదా మరుసటి రోజు గ్రామస్థులకు నాన్వెజ్ భోజనాలు వడ్డించడం సాధారణమేనని వివరించారు. ఇది కుటుంబ ఆచారాలు, ప్రాంతీయ సంప్రదాయాలపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు. అందువల్ల ఒక ప్రాంతపు ఆచారాన్ని మరో ప్రాంత ప్రమాణాలతో కొలవడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.
ప్రాంతానుసారం మారే ఆచారాలు
ఇక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉపనయన సంస్కారం వంటి కార్యక్రమాల సందర్భంగా కూడా మాంసాహారం వడ్డించే సంప్రదాయం ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆహార విషయంలో ప్రాంతానుసారం ఆచారాలు మారుతాయని, దాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
హైదరాబాద్లో రిసెప్షన్కు సిద్ధం
ఇదిలా ఉండగా, మార్చి 4న హైదరాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో విజయ్-రష్మిక వివాహ రిసెప్షన్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను రష్మిక స్వయంగా ఆహ్వానించినట్లు సమాచారం.