సాధారణంగా ప్రేమ పేరుతో మోసాలు జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయన కీలక సూచనలు జారీ చేశారు. మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని సీపీ తెలిపారు.
తొలుత సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులకు రావడం, పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిపించుకోవడం ద్వారా నమ్మకం కలిగిస్తున్నారు. పెళ్లి ఖాయమైందనే చనువుతో యువతులతో సన్నిహితంగా మెలిగి, మాయమాటలతో శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించారు.
Also Read: ఫిబ్రవరి 24 ఉద్రిక్తత? టీజీఎస్ఆర్టీసీ బస్సులు ఆపేస్తామన్న హెచ్చరిక
పెళ్లి సమయం దగ్గర పడగానే అసలు రంగు బయటపెట్టి, అదనపు కట్నం డిమాండ్ చేయడం లేదా పెళ్లి రద్దు చేస్తామని బెదిరించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.
బాధితుల మౌనం… కేటుగాళ్లకు ధైర్యం
సమాజంలో పరువు పోతుందనే భయంతో చాలామంది బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నారని సీపీ అన్నారు. ఈ మౌనాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు మరింత రెచ్చిపోతున్నారని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ షీ టీమ్స్ దృష్టికి ఇలాంటి పలు ఘటనలు వచ్చినట్టు వెల్లడించారు.
యువతులకు కీలక సూచనలు
- నిశ్చితార్థం అయిందని గుడ్డిగా నమ్మకూడదు.
- అబ్బాయి ప్రవర్తన, స్నేహితులు, అలవాట్లపై ముందే ఆరా తీయాలి.
- పెళ్లికి ముందే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేస్తే అది ప్రమాద సంకేతమని గుర్తించాలి.
ఇలాంటి మోసాలకు గురైన వారు భయపడకుండా ముందుకు రావాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని సీపీ హామీ ఇచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ 9490616555కు లేదా అత్యవసరంగా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.