ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం ప్రభావం కేవలం వంటగదులకే పరిమితం కాకుండా ఇతర కీలక రంగాలపై కూడా పడుతోంది. ముఖ్యంగా గ్యాస్ కొరత కారణంగా టెలికాం రంగంలో కొత్త సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.సాధారణంగా టెలికాం టవర్లు ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా వాటిపై ప్రత్యేక రక్షణ పూత వేస్తారు. ఈ ప్రక్రియను గాల్వనైజేషన్ అని పిలుస్తారు. ఇందులో ఇనుప నిర్మాణాలపై జింక్ పూత వేయడం ద్వారా తుప్పు పట్టకుండా, వర్షం, ఎండ వంటి వాతావరణ మార్పులను తట్టుకునేలా చేస్తారు.
ఈ ప్రక్రియలో జింక్ను కరిగించేందుకు భారీ స్థాయిలో ఇంధనం అవసరం అవుతుంది. సాధారణంగా ఎల్పీజీ లేదా ఎల్ఎన్జీ గ్యాస్ను ఉపయోగించి జింక్ను కరిగించి టవర్లపై రక్షణ పూత వేస్తారు. అయితే ప్రస్తుతం గ్యాస్ సరఫరాలో ఏర్పడిన కొరత కారణంగా ఈ తయారీ యూనిట్లకు అవసరమైన ఇంధనం అందడం లేదు.
అంతరాయాలు ఏర్పడే అవకాశం..
దీంతో అనేక టెలికాం టవర్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. టెలికాం టవర్ల తయారీలో ఏర్పడే ఈ జాప్యం నేరుగా నెట్వర్క్ విస్తరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా ఐదవ తరం మొబైల్ సేవలను విస్తరిస్తున్న సమయంలో కొత్త టవర్లు అవసరం అవుతున్నాయి. ఈ సమయంలో టవర్ల కొరత ఏర్పడితే సిగ్నల్ నాణ్యత తగ్గిపోవడం, మొబైల్ మరియు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అంబానీ ఇంట్లో వంటకారులకు లక్షల జీతం – ‘యాంటిలియా’లో భారీ సౌకర్యాలు
టవర్ తయారీ సంస్థలు ఇప్పటికే తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశాయి. అవసరమైన గ్యాస్ సరఫరా లేకపోతే తమ కార్యకలాపాలను కొనసాగించడం కష్టమవుతుందని వారు పేర్కొంటున్నారు. దీంతో టెలికాం కంపెనీలు కూడా భవిష్యత్ నెట్వర్క్ విస్తరణ ప్రణాళికలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
టెలికాం టవర్ల తయారీలో అంతరాయం ఏర్పడితే..
డిజిటల్ సేవలపై ఆధారపడి పనిచేస్తున్న ఆర్థిక వ్యవస్థకు టెలికాం రంగం కీలకమైనది. ఆన్లైన్ వ్యాపారం, డిజిటల్ చెల్లింపులు, విద్య, ఆరోగ్య సేవలు వంటి అనేక రంగాలు ఇంటర్నెట్ కనెక్టివిటీపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలికాం టవర్ల తయారీలో అంతరాయం ఏర్పడితే దాని ప్రభావం విస్తృతంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని టవర్ తయారీ పరిశ్రమకు అవసరమైన గ్యాస్ కోటాను కేటాయించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. సరఫరా సమస్యను త్వరగా పరిష్కరించకపోతే భవిష్యత్తులో మొబైల్ నెట్వర్క్ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.