ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిన బ్యూటీ మోనాలిసా. అయితే ఈ అమ్మడు ఇటీవల హీరోయిన్ అవతారంలో కనిపించి సందడి చేసింది. తాజాగా ఈ బ్యూటీ తన వివాహ వార్తతో మళ్లీ వార్తల్లో నిలిచింది. ఆమె బుధవారం (మార్చి 11) సాయంత్రం కేరళలోని ఓ ఆలయంలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకుంది. ఇక ఆమె వివాహం తర్వాత నెట్టింట అనేక ప్రచారాలు హల్చల్ చేశాయి.
ఈ క్రమంలో గురువారం మీడియాతో మాట్లాడిన మోనాలిసా, తమ వివాహంపై వస్తున్న వివాదాలపై స్పందించింది. మతాలు వేరు కావడంతో సోషల్ మీడియాలో ‘లవ్ జిహాద్’ అంటూ వస్తున్న విమర్శలను ఆమె ఖండించింది. “నేను అన్ని మతాలను గౌరవిస్తాను. మా వివాహం లవ్ జిహాద్ కాదు. మేము హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాం. నన్ను ఇస్లాం మతంలోకి మారమని ఫర్మాన్ ఎప్పుడూ అడగలేదు” అంటూ ఆమె స్పష్టం చేసింది.
అన్ని ప్రచారాలకి చెక్
ఇక తన వయస్సుపై వస్తున్న అనుమానాలకు కూడా మోనాలిసా చెక్ పెట్టింది. మీడియా సమావేశంలో తన బర్త్ సర్టిఫికేట్ను చూపిస్తూ తాను 2008లో జన్మించానని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను మేజర్ అని, తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలను తానే తీసుకునే హక్కు ఉందని కూడా ఆమె పేర్కొంది.
Also Read: తండ్రి పేరును తీసేసిన జాసన్ సంజయ్… విజయ్ కుటుంబంలో కొత్త చర్చ
ఇక ఫర్మాన్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్ జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, అతను వృత్తిరీత్యా నటుడు, మోడల్గా పనిచేస్తున్నాడని టాక్. మోనాలిసాతో కలిసి ఒక సినిమా ప్రాజెక్టులో పని చేసే సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మొదట సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన వీరు తర్వాత సినిమా షూటింగ్ సమయంలో కలవడంతో ఏర్పడి స్నేహం మరింత స్ట్రాంగ్గా మారింది. అనంతరం ప్రేమలో పడి ఆ ప్రేమని వివాహంగా మార్చుకున్నారు.
ఆరు నెలలుగా డేటింగ్లో
ఇక తమ ప్రేమ గురించి ఫర్మాన్ మాట్లాడుతూ, “మేము దాదాపు ఆరు నెలలుగా డేటింగ్లో ఉన్నాం. కానీ ఆ ఆరు నెలలు మాకు అరవై ఏళ్ల ప్రేమలా అనిపించాయి. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం” అని తెలిపాడు. ఇక తమ ప్రేమ కథలో ఆసక్తికర విషయం ఏమిటంటే మొదటగా ప్రపోజ్ చేసింది మోనాలిసానే. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. “నేను ప్రపోజ్ చేసినప్పుడు ఫర్మాన్ మొదట అంగీకరించలేదు. కానీ నా ప్రేమతో అతడిని ఒప్పించాను” అని ఆమె సరదాగా తెలియజేసింది.
ఇక తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని మోనాలిసా పోలీసులను ఆశ్రయించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి జైసింగ్ భోంస్లే తనను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాదు, తన మేనత్త కుమారుడితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నారని కూడా పేర్కొంది. ఇక కేరళలో ఆశ్రయం పొందిన ఈ జంట అక్కడే వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం, పోలీసులు తమకు మద్దతు ఇచ్చారని మోనాలిసా వెల్లడించింది. వీరి వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టితో పాటు గోవిందన్ కూడా హాజరయ్యారు.
కేరళ రాష్ట్రం కులమతాలకు అతీతంగా అందరినీ ఆదరిస్తుందని, భవిష్యత్తులో దక్షిణాది సినిమాల్లో నటిస్తూ ఇక్కడే స్థిరపడాలని ఉందని మోనాలిసా తన ఆశయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.