Sheetal Devi Temple: నలంద జిల్లాలోని శీతల్ దేవి ఆలయంలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. దీప్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మఘడా గ్రామంలో ఉన్న ఆలయంలో భారీగా భక్తులు చేరడంతో తొక్కిసలాట జరిగి కనీసం 8 మంది మహిళా భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పలువురు పాట్నాకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
Sheetal Devi Temple Accident
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రతి మంగళవారం లాగే ఈరోజు కూడా వేల సంఖ్యలో భక్తులు ఆలయాని(Sheetal Devi Temple)కి తరలివచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడంతో తోపులాట చోటుచేసుకుని, అది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనలో మరికొంత మంది గాయపడగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
మోహరించిన పోలీసు బలగాలు..
ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. సుమారు 12 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. వారిని చికిత్స కోసం సదర్ ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం ఆలయ ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు.
ఈ ఘటనపై నితిష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు విపత్తు నిర్వహణ శాఖ ద్వారా రూ. 4 లక్షలు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరో రూ. 2 లక్షలు చొప్పున, మొత్తం రూ. 6 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అశ్రద్ధ వలనేనా?
ఇక ఇదే రోజున నలంద యూనివర్సిటీలో కన్వొకేషన్ కార్యక్రమం జరగనుండటం గమనార్హం. ఈ కార్యక్రమానికి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ వేడుకలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు ఇతర కార్యక్రమాలపై దృష్టి సారించడం వల్ల ఆలయంలో నిర్లక్ష్యం జరిగిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారులు ఘటనపై విచారణ చేపట్టగా, అసలు కారణాలపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.