రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి రోగికి పూర్తి వైద్య చరిత్రను ఒకే డిజిటల్ వ్యవస్థలో అందుబాటులో ఉంచే డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును పైలెట్ ప్రాతిపదికన సంగారెడ్డి జిల్లాలో ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి ఈ ప్రాజెక్టు అమలు విధానం, సాంకేతిక ఏర్పాట్లు, అవసరమైన మౌలిక వసతులపై విస్తృతంగా చర్చించారు.
సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 64 ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థ అమలు చేయనున్నారు. ఇందులో ఒక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, నాలుగు ఏరియా ఆసుపత్రులు, ఐదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, నాలుగు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 31 ప్రైమరీ హెల్త్ సెంటర్లు, 19 బస్తీ దవాఖానాలు ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేసి, వారి ఆరోగ్య చరిత్రను డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నారు.
రోగి ఆసుపత్రికి వచ్చిన మొదటి దశ నుంచే—ఓపీ నమోదు నుంచి చికిత్స పూర్తయ్యే వరకు—డాక్టర్ పరీక్షలు, ల్యాబ్ రిపోర్టులు, మందుల వివరాలు వంటి అన్ని సమాచారం ఒకే డిజిటల్ ప్లాట్ఫారమ్లో నిల్వ అవుతుంది. దీని వల్ల వైద్యులు రోగి గత వైద్య చరిత్రను వెంటనే తెలుసుకుని తక్షణ చికిత్స అందించగలుగుతారని మంత్రి తెలిపారు.
ఇంకా ముఖ్యంగా ఎన్సీడీ (Non-Communicable Diseases), అంటువ్యాధులు, తల్లి-శిశు ఆరోగ్య సేవలు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొన్నారు. అవసరమైతే రోగులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేసే ప్రక్రియ కూడా వేగవంతం అవుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్. చొంగ్తు, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు అమలు విధానంపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు.
సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఆసుపత్రిలో తీసుకున్న చికిత్స వివరాలు మరో ఆసుపత్రిలో అందుబాటులో ఉండవు. దీంతో రోగి వైద్య చరిత్ర తెలియక చికిత్స ఆలస్యం కావడం లేదా పరీక్షలు మళ్లీ చేయాల్సి రావడం జరుగుతుంది.
ఈ సమస్యకు పరిష్కారంగా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థ పనిచేస్తుంది. ఒకసారి హెల్త్ కార్డు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అయినా రోగి వైద్య చరిత్ర వెంటనే అందుబాటులో ఉంటుంది. సంగారెడ్డిలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Also Read: నిర్భయ నిధిలో ములుగు ఎంపిక.. కేంద్రానికి సీతక్క కృతజ్ఞతలు