మేడ్చల్ జిల్లాలో సంచలనం… మైనర్ విద్యార్థినిని సీక్రెట్‌గా వివాహం చేసుకున్న‌ టీచర్ అరెస్ట్

Teacher Arrested in POCSO Case: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పి, తాను పనిచేస్తున్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినిని రహస్యంగా వివాహం చేసుకున్న ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో వెలుగుచూసింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Teacher Arrested in POCSO Case in Medchal Malkajgiri District
Teacher Arrested in POCSO Case in Medchal Malkajgiri District

Teacher Arrested in POCSO Case

  • మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్‌పై మైనర్ విద్యార్థినితో అక్రమ వివాహం ఆరోపణలు.

  • బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోచారం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్.

  • విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులకు నీతులు బోధించాల్సిన ఓ టీచర్ తానే తప్పుదారిపట్టి, తన వద్దే చదువుతున్న పదో తరగతి మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ప్రేమ పేరుతో వ‌ల‌..

పోలీసుల వివరాల ప్రకారం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పర్రే మైటీన్ (27) ఫిజికల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకుని, క్రమంగా మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఇటీవల బాలిక మెడలో పసుపు తాడు కనిపించడంతో ఆమె తల్లి అనుమానం వ్యక్తం చేసి నిలదీయగా అసలు విషయం బయటపడింది. టీచర్ తనను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని బాలిక చెప్పడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోక్సో చట్టం కింద కేసు ..

ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక తల్లిదండ్రులు మొదట పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ నుంచి సరైన స్పందన రాకపోవడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. దీంతో వారు నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోచారం పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టి నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారించి అరెస్ట్ చేశారు.

తరువాత నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మైనర్ బాలిక భద్రత, కౌన్సెలింగ్ ఏర్పాట్లపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొనగా, విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతపై మరింత పర్యవేక్షణ అవసరమనే చర్చ మళ్లీ మొదలైంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »