హైదరాబాద్: వేసవి భానుడు తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించాడు. తెలంగాణలో నేటి నుండి భారీ వడగాల్పులు (Heatwave) వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఏ జిల్లాల్లో ఎంత ఎండ?
1. ఉత్తర తెలంగాణ (డ్రై హీట్ – 42°C నుండి 45°C):
అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఎండలు మండిపోనున్నాయి. ఇక్కడ గాలిలో తేమ తక్కువగా ఉండి, ‘డ్రై హీట్’ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
2. దక్షిణ మరియు తూర్పు తెలంగాణ (ఉక్కపోతతో కూడిన ఎండ):
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41-43°C గా ఉన్నప్పటికీ, గాలిలో తేమ (Humidity) ఎక్కువగా ఉండటం వల్ల ‘రియల్ ఫీల్’ 42-45°C వరకు ఉంటుంది. అంటే ఎండ కంటే ఉక్కపోత ఎక్కువగా బాధిస్తుంది.
Also Read : Telangana Heat Alert : తెలంగాణలో ఎండల హెచ్చరిక – 25 జిల్లాల్లో 40°C వరకు ఉష్ణోగ్రతలు
3. హైదరాబాద్ అప్డేట్:
భాగ్యనగరంలో రాబోయే 7 రోజులు నిరంతరంగా 40°C నుండి 42°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. నగరం కాంక్రీట్ జంగిల్ కావడం వల్ల వేడి తీవ్రత రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది.
4. ఇతర జిల్లాలు:
నల్గొండ, గద్వాల జిల్లాల్లో కూడా 42-45°C వరకు ఎండలు రోస్ట్ చేయనున్నాయి. మిగిలిన జిల్లాల్లో 41-43°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి.
ప్రజలకు సూచనలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మధ్యాహ్నం ప్రయాణాలు వద్దు: ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దు.
నీరు ఎక్కువగా తాగండి: దాహం వేయకపోయినా మంచి నీరు, ఓఆర్ఎస్ (ORS), మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి.
దుస్తులు: వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించండి. బయటకు వెళ్లినప్పుడు గొడుగు లేదా టోపీ వాడండి.
నీడన ఉండండి: పశువులను, పెంపుడు జంతువులను ఎండలో కట్టేయకుండా నీడలో ఉంచండి.
ఎండలు ప్రాణాంతకమయ్యే అవకాశం ఉన్నందున వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Also Read : అకాల వర్షాలకు ముగింపు.. మార్చి తొలి వారం నుంచి తెలంగాణలో తీవ్ర ఎండల హెచ్చరిక


