మున్సిపల్ ఎన్నికల్లో గణనీయ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ, హంగ్ వచ్చిన మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. చైర్మన్, మేయర్ ఎన్నికల ముందు పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించి వ్యూహాలు చర్చించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ పోరులో అత్యధిక వార్డులు, కార్పొరేషన్ డివిజన్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అయితే కొన్ని మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకోవాలనే దిశగా పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో చైర్మన్, మేయర్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి పార్టీ కీలక నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల వ్యూహాలు, హంగ్ మున్సిపాలిటీలలో అనుసరించాల్సిన విధానాలపై నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
వ్యూహాత్మకంగా..
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ 66 చైర్మన్ పీఠాలను గెలుచుకుంది. అలాగే ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో మూడు మేయర్ స్థానాలను సాధించింది. మరో మూడు కార్పొరేషన్లలో హంగ్ పరిస్థితి నెలకొనగా, మున్సిపాలిటీల్లో సుమారు 30కిపైగా చోట్ల స్పష్టమైన మెజారిటీ లేకపోవడం గమనార్హం. దీంతో ఆయా ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సీఎం పార్టీ నాయకత్వానికి సూచించారు.
మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నికలపై జరిగిన ఈ వర్చువల్ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సోమవారం జరగనున్న ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహరచనపై విస్తృతంగా చర్చించారు.
సమతుల్యత పాటించాలి…
హంగ్ మున్సిపాలిటీలలో ఒక్కటి కూడా చేజారకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ఇన్ఛార్జిల నుండి వివరాలు సేకరించి, నగరపాలక సంస్థల మేయర్ ఎన్నికల్లో సామాజిక సమతుల్యత పాటించాలని సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా మున్సిపల్ పాలక మండళ్ల ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కీలక వ్యూహాలతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.