విద్యార్థులకు శుభవార్త.. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు, మార్కుల మెమోలు

తెలంగాణలో డిజిటల్ పాలనకు మరో కీలక అడుగు పడింది. వాట్సాప్ వేదికగా విద్యార్థులు, తల్లిదండ్రులకు పాఠశాల సమాచారం, హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, ప్రోగ్రెస్ రిపోర్టులు నేరుగా అందించే సేవలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

Telangana School Education
Telangana School Education

తెలంగాణలో విద్యా రంగంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇకపై విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని నేరుగా తమ వాట్సాప్‌లోనే పొందనున్నారు. హాల్ టికెట్లు, మార్కుల మెమోలు, ప్రోగ్రెస్ రిపోర్టులు, పరీక్షా ఫలితాలు వంటి సేవలు ఇంటి నుంచే అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. విద్యాశాఖ, మీసేవ సంయుక్తంగా రూపొందించిన ఈ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నేరుగా లబ్ధి పొందనున్నారు.

వాట్సాప్‌లో ఏయే సేవలు అందుబాటులో?

ప్రస్తుతం వాట్సాప్ ద్వారా ఈ క్రింది సేవలు అందుబాటులోకి వచ్చాయి:

  • విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు
  • హాల్ టికెట్ల డౌన్‌లోడ్
  • మార్కుల మెమోలు
  • పరీక్షా ఫలితాలు
  • ఎస్‌ఎస్‌సీ మెమోలు
  • బోనఫైడ్ సర్టిఫికెట్లు
  • ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు (TC)
  • ఎస్‌ఎస్‌సీ మెమో సవరణలకు దరఖాస్తులు

ఈ సేవల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమయం, డబ్బు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

త్వరలో మరిన్ని సేవలు

ఈ ప్లాట్‌ఫారమ్‌ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. త్వరలోనే:

  • యూనిఫాంల పంపిణీ వివరాలు
  • పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ సమాచారం
  • విద్యార్థుల హాజరు
  • ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు
  • మధ్యాహ్న భోజన పథకం వివరాలు
  • ఆరోగ్య, సంక్షేమ కార్యక్రమాలు
  • క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాల సమాచారం
  • రెసిడెన్షియల్ పాఠశాలల సేవలు
  • విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ

వాట్సాప్ ద్వారానే అందుబాటులోకి రానున్నాయి.

పాలపిట్ట డిజిటల్ మస్కట్‌గా

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టను డిజిటల్ మస్కట్‌గా పరిచయం చేశారు.

పాలపిట్ట యానిమేషన్ వీడియోల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులకు:

  • విద్యా సమాచార సందేశాలు
  • అవగాహన కార్యక్రమాలు
  • ప్రభుత్వ పథకాల వివరాలు
  • ప్రేరణాత్మక వీడియోలు

వాట్సాప్ ద్వారా పంపించనున్నారు.

దీంతో ప్రభుత్వ సమాచారం మరింత సులభంగా, ఆకర్షణీయంగా ప్రజలకు చేరుతుందని అధికారులు భావిస్తున్నారు.

మీసేవ – విద్యాశాఖ సంయుక్త ప్రయత్నం

ఈ ప్లాట్‌ఫారమ్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వ సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD)-మీసేవ విభాగం, పాఠశాల విద్యాశాఖ కలిసి అభివృద్ధి చేశాయి.

ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడం, పారదర్శకంగా, వేగంగా అందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

సీఎం రేవంత్ ఏమన్నారు?

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, విద్యా రంగంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించి విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రభుత్వం మధ్య డిజిటల్ అనుసంధానాన్ని బలోపేతం చేయడంలో ఈ వాట్సాప్ సేవలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ప్రజలకు చేరువైన, సమర్థవంతమైన డిజిటల్ సేవల అందింపులో తెలంగాణ మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు.

డిజిటల్ తెలంగాణ దిశగా మరో అడుగు

ఇప్పటికే మీసేవ ద్వారా అనేక ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు వాట్సాప్ వేదికగా పాఠశాల విద్యా సేవలను తీసుకురావడం తెలంగాణ డిజిటల్ పాలనలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తోంది.

ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »