రిటైర్ అవుతున్న పోలీసులకు సజ్జనార్ కీలక సూచనలు — సైబర్ మోసాల జాగ్రత్త, డబ్బు ఎక్కడ దాచాలో తెలుసా?

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పదవీ విరమణ పొందుతున్న 19 మంది అధికారులకు తాజాగా వీడ్కోలు పలికారు. రిటైర్మెంట్ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన

Hyderabad CP Sajjanar

హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం సేవలందించిన 19 మంది పోలీసు అధికారులకు నగర పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ఈరోజు ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ పొందుతున్న వారిలో నలుగురు ఎస్ఐలు, పది మంది ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ముగ్గురు ఎల్జీఈ ఉన్నారు. వీడ్కోలు సమావేశంలో సజ్జనార్ పదవీ విరమణ పొందే అధికారులకు ఆరోగ్యం, ఆర్థిక భద్రత, కుటుంబ జీవితంపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సుమారు 41 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసిన అనుభవజ్ఞులైన అధికారులు వెళ్తుండటం పోలీసు శాఖకు లోటని పేర్కొన్నారు.

సజ్జనార్ ఇచ్చిన కీలక సూచనలు ఏమిటి?

పదవీ విరమణ అనేది జీవితంలో ముగింపు కాదు, ఒక కొత్త ఆరంభమని సజ్జనార్ స్పష్టం చేశారు. శేష జీవితాన్ని కుటుంబంతో కలిసి ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడపాలని సూచించారు. నిత్యం ఏదో ఒక వ్యాపకంతో చురుగ్గా ఉండటం అవసరమని పేర్కొన్నారు. పూర్వం ఫుట్ పెట్రోలింగ్ నుండి ప్రస్తుత ఇన్నోవా పెట్రోలింగ్ వరకు మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలందించిన వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

Also Read: జంట నగర వాసులకు శుభవార్త ,మార్చి 1 నుంచి e-మెట్రో AC, మెట్రో డీలక్స్ టికెట్ రేట్లలో భారీ తగ్గింపు, ఈరోజే అమలు!

ఆర్థిక జాగ్రత్తలు – సైబర్ మోసాల హెచ్చరిక

రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో వచ్చే నగదును ప్రభుత్వ బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో మాత్రమే భద్రపరచుకోవాలని సజ్జనార్ కీలక సూచన చేశారు. అధిక లాభాల ఆశ చూపే మోసగాళ్ల పట్ల, ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది అధికారులు పెద్ద మొత్తం డబ్బు చేతికి వచ్చినప్పుడు అధిక రాబడి ఆశతో తప్పుడు పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నారని, అలాంటి మోసాలకు బలి కాకూడదని స్పష్టం చేశారు. పోలీసు అధికారిగా సైబర్ మోసాలు ఎంత ప్రమాదకరమో తెలిసిన వారు రిటైర్ అయిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉండాలని నొక్కిచెప్పారు.

కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి

పదవీ విరమణ పొందిన అధికారులను గౌరవప్రదంగా చూసుకోవాలని కుటుంబ సభ్యులను సజ్జనార్ ప్రత్యేకంగా కోరారు. దశాబ్దాల పాటు సమాజ సేవలో గడిపిన వారికి శేష జీవితంలో మానసిక ప్రశాంతత అత్యంత అవసరమని, అందుకు కుటుంబ సభ్యుల సహకారం కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు విభాగం తరపున పదవీ విరమణ పొందే అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »