Chandrababu Naidu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇంధన పొదుపు చర్యలను కొనసాగిస్తూనే భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రెండు మినీ బస్సులను కాన్వాయ్లో చేర్చారు. ఇటీవల సీఎం కుప్పం పర్యటన సందర్భంగా ఈ వాహనాలు తొలిసారిగా కనిపించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు నేపథ్యంలో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. గతంలో 12పైగా వాహనాలతో సాగిన కాన్వాయ్ను నాలుగు వాహనాలకే పరిమితం చేశారు. ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం భద్రత విషయంలో మాత్రం పోలీసులకు సవాళ్లు ఎదురయ్యాయి.
Read Also : YS Jagan | ఆక్వా ఫీడ్ ధరల పెంపు రగడ.. ఏపీలో వైసీపీ-టీడీపీ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం..!
ముఖ్యమంత్రికి జడ్ ప్లస్ భద్రత కల్పించబడుతున్న నేపథ్యంలో ఎన్ఎస్జీ కమాండోలు, ఇంటెలిజెన్స్, రాష్ట్ర భద్రతా సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో అధికారులు వెంట ప్రయాణించాల్సి వస్తోంది. కాన్వాయ్లో వాహనాలు తగ్గిపోవడంతో భద్రతా సిబ్బంది ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా జిల్లాల పర్యటనల సమయంలో తక్కువ వాహనాల్లో సిబ్బందిని సర్దుబాటు చేయడం కష్టమవుతోందని అధికారులు గుర్తించారు. ఈ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఉన్నతాధికారులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కాన్వాయ్లో మళ్లీ కార్ల సంఖ్య పెంచకుండా, భద్రతా సిబ్బంది కోసం రెండు మినీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో బస్సులో 13 మంది చొప్పున మొత్తం 26 మంది సిబ్బంది ప్రయాణించేలా ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేశారు. దాంతో భద్రతా సిబ్బందికి మాత్రమే కాకుండా, అత్యవసర వైద్య సిబ్బందికి కూడా సౌకర్యం కలిగిందని అధికారులు చెబుతున్నారు.
Read Also : ఏపీలో విస్తరణపై ఉబెర్ దృష్టి.. సీఎం చంద్రబాబుతో గ్లోబల్ సీఈఓ భేటీ..!
ఇకపై ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలు, అధికారిక కార్యక్రమాల సమయంలో ఈ మినీ బస్సులనే వినియోగించనున్నట్లు తెలుస్తోంది. భద్రతా అవసరాలు, ఇంధన పొదుపు ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల కాన్వాయ్లపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కాన్వాయ్లలో వాహనాల సంఖ్య తగ్గించుకున్న విషయం తెలిసిందే. కేంద్రం పిలుపు మేరకు ఇంధన పొదుపు పాటించడంతో పాటు ఖర్చులను తగ్గిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కాన్వాయ్లో చేసిన తాజా మార్పులు రాజకీయ, అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also : మూడో బిడ్డ పుడితే రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40వేలు.. నరసన్నపేటలో ప్రకటించిన చంద్రబాబు..


