ఖరగ్‌పూర్-అమరావతి కారిడార్‌కు గ్రీన్ సిగ్నల్.. ఏపీకి భారీ బూస్ట్!

ఖరగ్‌పూర్–అమరావతి 1,107 కి.మీ కారిడార్‌కు ఆమోదం. ఏపీలో 457 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో అమరావతికి కొత్త కనెక్టివిటీ, పరిశ్రమలకు భారీ ఊపు.

Kharagpur Amaravati Corridor
Kharagpur Amaravati Corridor

ఆంధ్రప్రదేశ్‌కు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా భావిస్తున్న ఖరగ్‌పూర్–అమరావతి కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. మొత్తం 1,107 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ కారిడార్‌లో ఏకంగా 457 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉండనున్నాయి. ఈ ప్రాజెక్టుతో అమరావతికి తూర్పు భారతంతో రహదారి అనుసంధానం మరింత బలోపేతం కానుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆమోదంపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రహదారులు-రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. రైతులు, పరిశ్రమలకు లాజిస్టిక్స్ వ్యయం తగ్గడంతో పాటు పరిశ్రమలు, వ్యవసాయం, వాణిజ్యం, ఉపాధి రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.

ఏపీ మీదుగా 457 కిలోమీటర్లు

ఖరగ్‌పూర్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కీలక ప్రాంతాల మీదుగా రహదారి వెళ్లనున్నట్లు వెల్లడైంది. అందులో ప్రధానంగా:

  • అరకు
  • పాడేరు
  • చింతపల్లి
  • జంగారెడ్డిగూడెం

తదితర ప్రాంతాలు ఉండనున్నాయి. ఏపీ పరిధిలోని కారిడార్ వ్యయం సుమారు రూ.32 వేల కోట్లుగా అంచనా వేస్తున్నారు.

ఈ రహదారిని నాలుగు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేగా అభివృద్ధి చేయనున్నట్లు సమాచారం. కారిడార్‌లో వాహనాలు గంటకు సుమారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపకల్పన చేయనున్నట్లు పేర్కొన్నారు.

అమరావతి ORRతో అనుసంధానం

ఈ భారీ కారిడార్‌ను అమరావతి ఔటర్ రింగ్ రోడ్‌తో అనుసంధానించే ప్రణాళిక ఉంది. దీంతో రాజధాని అమరావతి చుట్టూ ఏర్పడుతున్న రహదారి నెట్‌వర్క్‌కు మరింత బలం చేకూరే అవకాశం ఉంది.

అమరావతిని కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా ఆర్థిక, పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఈ కారిడార్ కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా సరుకు రవాణా వేగవంతం కావడం ద్వారా పరిశ్రమలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

రైతులు, పరిశ్రమలకు ఎలా ఉపయోగం?

కొత్త కారిడార్‌తో వ్యవసాయ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల రవాణా సమయం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక ప్రాంతాల నుంచి ప్రధాన మార్కెట్లు, పోర్టులు లేదా పారిశ్రామిక కేంద్రాలకు చేరేందుకు ఎక్కువ సమయం పడుతోంది.

లాజిస్టిక్స్ ఖర్చు తగ్గితే రైతులు, చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు ప్రయోజనం చేకూరవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కారిడార్ వెంట కొత్త లాజిస్టిక్స్ కేంద్రాలు, గిడ్డంగులు, వాణిజ్య కార్యకలాపాలు అభివృద్ధి చెందే అవకాశమూ ఉంది.

ఏపీలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రాంతాల్లో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, పారిశ్రామిక పార్కులు, అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలో కీలకంగా ఉన్నాయి.

ఇప్పటికే నిర్మాణంలో లేదా ప్రతిపాదన దశలో ఉన్న ప్రధాన ప్రాజెక్టుల్లో:

  • నాలుగు గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు
  • నాలుగు కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు
  • అమరావతి గ్రీన్‌ఫీల్డ్ రాజధాని
  • మూడు మెగా ఇండస్ట్రియల్ పార్కులు
  • పోలవరం సహా ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు
  • అమరావతి ORR, IRR
  • రెండు కొత్త గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల ప్రతిపాదనలు

ఉన్నట్లు సమాచారం.

ముందున్న అసలు సవాలు ఏమిటి?

ఖరగ్‌పూర్అ-మరావతి కారిడార్‌కు ఆమోదం రావడం కీలక అడుగు అయినప్పటికీ, భూసేకరణ, పర్యావరణ అనుమతులు, నిధుల సమీకరణ, నిర్మాణ కాలపట్టిక వంటి అంశాలు తదుపరి దశల్లో కీలకం కానున్నాయి.

ప్రాజెక్టు ప్రతిపాదించిన వేగంతో పూర్తి అయితే ఉత్తరాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాలు, పశ్చిమ గోదావరి ప్రాంతాలకు మెరుగైన రహదారి అనుసంధానం లభించే అవకాశం ఉంది. అమరావతికి తూర్పు భారతంతో ఏర్పడే ప్రత్యక్ష కనెక్టివిటీ రాష్ట్ర వాణిజ్య, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపునిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

మొత్తంగా 1,107 కిలోమీటర్ల ఖరగ్‌పూర్అ-మరావతి కారిడార్‌లో 457 కిలోమీటర్లు ఏపీ మీదుగా వెళ్లడం రాష్ట్ర మౌలిక సదుపాయాల రంగంలో కీలక పరిణామంగా మారింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అమలు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏయే జిల్లాల మీదుగా తుది అలైన్‌మెంట్ ఖరారవుతుంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »