ముంబైలో ‘ఐఎన్టీ ఆదిత్య బిర్లా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ’ ప్రారంభం.. భారతీయ కళల వారసత్వానికి నూతన రూపు!

భారతీయ ప్రదర్శన కళల (పర్ఫార్మింగ్ ఆర్ట్స్) రంగానికి సరికొత్త ఊపునిస్తూ ఆదిత్య బిర్లా గ్రూప్ ముంబైలో ప్రతిష్టాత్మక "ఐఎన్టీ ఆదిత్య బిర్లా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ" (INT Aditya Birla Performing Arts Academy) ని ప్రారంభించింది. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఎంతో మంది చారిత్రాత్మక కళాకారులను అందించిన 'ఇండియన్ నేషనల్ థియేటర్' (INT) వారసత్వాన్ని కాపాడేందుకు ఈ నూతన అకాడమీని ఏర్పాటు చేశారు. లాభాపేక్ష లేని ఈ చొరవ ద్వారా అరుదైన రికార్డింగుల ఆర్కైవ్స్ నిల్వ చేయడంతో పాటు, వెనుకబడిన వర్గాల పిల్లలకు కళలను ఉచితంగా చేరవేయనున్నారు.

భారతదేశ ప్రదర్శన కళల రంగానికి సరికొత్త దిశను నిర్దేశిస్తూ , దేశీయ సాంస్కృతిక మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆదిత్య బిర్లా గ్రూప్ ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. ముంబై వేదికగా 22 జూన్ 2026 నాడు “ఐఎన్టీ ఆదిత్య బిర్లా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అకాడమీ” (INT Aditya Birla Performing Arts Academy) ని అధికారికంగా ప్రారంభించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామ కాలం (1940ల) నుండి ఎందరో మహోన్నత కళాకారులకు, నాటక రంగానికి ఊపిరి పోసిన ‘ఇండియన్ నేషనల్ థియేటర్’ (INT) కు నూతన రూపాన్ని, మరింత విస్తృతమైన లక్ష్యాలను జోడిస్తూ ఈ అకాడమీని ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక కేంద్రాన్ని అకాడమీ చైర్‌పర్సన్ శ్రీమతి రాజశ్రీ బిర్లా గారు, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా, నీరజా బిర్లా, అనన్యా బిర్లా , ఆర్యమన్ విక్రమ్ బిర్లా ల సమక్షంలో ఘనంగా ప్రారంభించారు.

ఆదిత్య బిర్లా గ్రూప్ చరిత్రలో మొదటి నుండి పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు , పరిశోధనా కేంద్రాల ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడం ఒక ముఖ్యమైన సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే ఐఎన్టీ (INT) ని పునర్నిర్మించడం ద్వారా భారతీయ కళలు, నృత్యం, నాటకం , సంగీత రంగాలలో సరికొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు ఒక జాతీయ వేదికను కల్పించారు. సృజనాత్మకత, సంస్కృతి అనేవి ఒక శక్తివంతమైన సమాజానికి ముఖ్యమైన పిల్లర్లు అనే ఆదిత్య విక్రమ్ బిర్లా గారి నమ్మకానికి నిజమైన నివాళిగా ఈ సంస్థను తీర్చిదిద్దినట్లు రాజశ్రీ బిర్లా పేర్కొన్నారు.

దిగ్గజాల సమక్షంలో ప్రారంభ వేడుక.. అరుదైన సాంస్కృతిక ఆర్కైవ్స్
ఈ సరికొత్త అకాడమీ సలహా మండలిలో (Advisory Council) దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన కళాకారులు భాగస్వాములుగా ఉన్నారు. వీరిలో ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, డాక్టర్ ఎన్. రాజం, శంకర్ మహదేవన్, ఉల్హాస్ కశాల్కర్, అరుణా సాయిరాం, లాల్గుడి జిజెఆర్ కృష్ణన్, లూయిస్ బ్యాంక్స్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రజిత్ కపూర్ , టెరెన్స్ లూయిస్ వంటి ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ ముగింపు వేడుకల ప్రారంభ రాత్రి వేదికపై ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి:

ముఖ్య అతిథి ప్రసంగం: ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సైరస్ సాహుకార్‌తో జరిగిన చర్చలో సృజనాత్మకత, జీవిత అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సంగీత నివాళి: ప్రముఖ గాయని కౌషికి చక్రవర్తి.. లెజెండరీ గాయనులైన నూర్జహాన్, శోభా గుర్తూ, కిషోరి అమోంకర్ , బేగం అక్తర్ ల జ్ఞాపకార్థం అద్భుతమైన శాస్త్రీయ సంగీత నివాళిని అందించారు.

ఇండియన్ నేషనల్ థియేటర్ (INT) గతంలో పి.ఎల్. దేశ్‌పాండే, డాక్టర్ శ్రీరామ్ లగూ, అమ్రీష్ పురి, సదాశివ్ అమ్రాపూర్కర్, స్మితా పాటిల్, సంజీవ్ కుమార్ , పరేష్ రావల్ వంటి ఎందరో లెజెండరీ నటులను దేశానికి అందించింది. ఈ సుదీర్ఘ చరిత్రను కాపాడేందుకు గానూ అకాడమీలో ఒక ప్రత్యేక ఆర్కైవల్ కేంద్రాన్ని (Archival Centre) ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అరుదైన పాత సంగీత రికార్డింగులు, చారిత్రాత్మక ప్రదర్శనలు , మైలురాయి లాంటి సినిమా పనులను భద్రపరచనున్నారు.

ఉచిత కళా విద్య.. సామాజిక సమగ్రతకు ప్రాధాన్యత
పూర్తిగా లాభాపేక్ష లేని (Not-for-profit initiative) సామాజిక దృక్పథంతో ఈ అకాడమీ పనిచేయనుంది. కేవలం కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడమే కాకుండా, సమాజంలో వెనుకబడిన లేదా నిరుపేద వర్గాల (Underserved communities) పిల్లలకు , యువతకు ఈ ప్రదర్శన కళలను ఉచితంగా చేరవేయడమే దీని ప్రధాన లక్ష్యం. దీనివల్ల నిరుపేద విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సరికొత్త అవకాశాలు మెరుగై సామాజిక సమగ్రత (Social inclusion) సాధ్యమవుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. సమాజాన్ని శక్తివంతం చేసే ఆదిత్య బిర్లా గ్రూప్ సుదీర్ఘ సేవా సంప్రదాయంలో ఈ అకాడమీ ఒక మైలురాయిగా నిలవనుంది.

About Author:

Vidya Burujukadi

కంటెంట్ రైటర్‌గా మన వార్త వెబ్ సైట్‌కి విద్య.బి పనిచేస్తున్నారు. ప్రధానంగా బిజినెస్ వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారం, జనరల్ అంశాలకు సంబంధించిన కథనాలను ఆమె అందిస్తారు. విద్యకు తెలుగు మీడియా…

More About Author »