టాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించిన ‘పుష్ప’ Pushpa సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ చెప్పిన “పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా… ఫైర్” అనే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ డైలాగ్ వినిపించినప్పుడల్లా ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. విడుదలైన తర్వాత కూడా ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు చాలామంది ఈ డైలాగ్ను అనుకరిస్తూ వీడియోలు, రీల్స్ చేయడం కనిపించింది.
అయితే ఈ డైలాగ్ గురించి తాజాగా నటి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానే ముందుగా ఈ డైలాగ్ చెప్పానని ఆమె సరదాగా తెలిపారు. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం ‘లేచింది మహిళాలోకం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎంజాయ్ చేస్తూ నటించాను…
మంచు లక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లేచింది మహిళాలోకం’ చిత్రాన్ని దర్శక ద్వయం అర్జున్–కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన మంచు లక్ష్మి సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేం చిన్న సినిమా చేసినా అద్భుతమైన సినిమా చేశాం. ఈ సినిమాలో నేను కామెడీ Comedy విషయంలో చాలా ఎంజాయ్ చేస్తూ నటించాను. షూటింగ్ సమయంలో ఫ్లోలో కొన్ని మార్పులు కూడా చేశాం” అని చెప్పారు.
సినిమాను కేవలం వినోదాత్మకంగా చూడాలని ఆమె కోరారు. “సీరియస్ సబ్జెక్టును కూడా కామెడీగా చెబితే ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా మహిళలు అందరూ ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. నిర్మాతలు పెట్టిన డబ్బుకంటే రెట్టింపు వసూళ్లు రావాలని ఆశిస్తున్నాను. ప్రమోషన్స్లో చూపించిన బ్లూ డ్రమ్కు సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ‘లేచింది మహిళాలోకం’ ఎవరినీ చంపమని చెప్పే సినిమా కాదు, అందరినీ నవ్వించే చిత్రం” అని ఆమె వివరించారు.
ఈ సినిమాలో తాను ‘పుష్ప’ అనే పాత్రలో కనిపిస్తానని మంచు లక్ష్మి Manchu Lakshmi తెలిపారు. అదే సందర్భంలో ‘పుష్ప’ సినిమా డైలాగ్ గురించి మాట్లాడుతూ సరదాగా వ్యాఖ్యానించారు. “ఈ సినిమా ‘పుష్ప’ రిలీజ్ అయ్యే ముందు పూర్తయింది. దర్శకుడు సుకుమార్ గారికి చెప్పాలనుకుంటున్నాను… ఫ్లవర్ కాదు ఫైర్ అని ముందుగా నేనే చెప్పాను. కానీ మా డైలాగ్ బయటకు రాలేదు. తర్వాత ‘పుష్ప’ సినిమాలో ఆ డైలాగ్ వినగానే అది నాదే అనిపించింది. అప్పుడే చాలా ఫీల్ అయ్యాను” అని నవ్వుతూ చెప్పారు.
ప్రస్తుతం సినిమాలు నిర్మించే ఆలోచన లేదని కూడా మంచు లక్ష్మి వెల్లడించారు. తనకు కథలు పంపాలని అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపొద్దని కూడా ఆమె అభిమానులకు విజ్ఞప్తి చేశారు.