బిర్యానీ, ఇరానీ చాయ్ మ్యాజిక్.. దేశంలో బెస్ట్ ఫుడ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్

హైదరాబాద్‌కు మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. ఇండియా టుడే టూరిజం అవార్డ్స్ 2026లో ‘నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు’ను గెలుచుకుని, దేశంలోనే అగ్రగామి ఆహార పర్యాటక కేంద్రంగా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంది.

Hyderabad Wins National Culinary Destination Award at India Today Tourism Awards 2026
దేశంలోనే బెస్ట్ ఫుడ్ డెస్టినేషన్‌గా హైదరాబాద్.. జాతీయ అవార్డు సొంతం
  • తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అవార్డును అందుకున్నారు.
  • ఇండియా టుడే టూరిజం అవార్డ్స్ 2026లో హైదరాబాద్‌కు నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు.
  • గోవాలో జరిగిన ఇండియా టుడే టూరిజం సమ్మిట్‌లో అవార్డు ప్రదానం జరిగింది.

హైదరాబాద్ మరోసారి తన రుచులతో దేశాన్ని మెప్పించింది. బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ ఇప్పుడు ఇండియా టుడే టూరిజం అవార్డ్స్ 2026లో నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు ను సొంతం చేసుకుంది. ఈ అవార్డు తెలంగాణ పర్యాటక రంగానికి మరో మైలురాయిగా నిలిచింది.

గోవాలో సోమవారం నిర్వహించిన ఇండియా టుడే టూరిజం సమ్మిట్‌లో ఈ అవార్డును కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఇండియా టుడే గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ అరుణ్ పూరి, గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్పతో పాటు దేశవ్యాప్తంగా పర్యాటక శాఖ మంత్రులు, పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.

బిర్యానీ నుంచి తెలంగాణ రుచుల వరకు..

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌కు ఈ గుర్తింపు రావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు.

“హైదరాబాద్ వంటకాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించాయి. ముఖ్యంగా హైదరాబాదీ బిర్యానీ, ఇరానీ చాయ్, తెలంగాణ సంప్రదాయ వంటకాలు దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ అవార్డు ఆ వారసత్వానికి వచ్చిన గౌరవం” అని ఆయన అన్నారు.

హైదరాబాద్‌లోని పాతబస్తీ నుంచి ఆధునిక ఫుడ్ స్ట్రీట్‌ల వరకు విభిన్న రుచులు అందుబాటులో ఉండటం నగరాన్ని ప్రత్యేకంగా నిలబెడుతోందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ

ఈ అవార్డు తెలంగాణ పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సంకేతమని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పర్యాటక రంగ అభివృద్ధికి పలు కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

వారసత్వ కట్టడాలు, ఎకో టూరిజం సర్క్యూట్లు, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, అడ్వెంచర్ టూరిజం, సాంస్కృతిక వేడుకలను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణను దేశంలోని ప్రముఖ పర్యాటక రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

ప్రపంచ ఫుడ్ మ్యాప్‌లో హైదరాబాద్

ఇటీవల ప్రపంచంలోని ప్రముఖ ఫుడ్ డెస్టినేషన్ల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జాతీయ స్థాయిలో ‘కలినరీ డెస్టినేషన్’ అవార్డు రావడంతో నగర ఖ్యాతి మరింత పెరిగింది.

ఆహార పర్యాటకం (Culinary Tourism) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంగా మారింది. స్థానిక వంటకాలను ఆస్వాదించేందుకు ప్రత్యేకంగా ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తన ప్రత్యేక రుచులతో దేశంలోని ఇతర నగరాలకు గట్టి పోటీ ఇస్తోంది.

పర్యాటక మౌలిక వసతులపై దృష్టి

తెలంగాణలో పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, వారసత్వ, వైద్య, ఆధ్యాత్మిక, ఎకో, ఫుడ్ టూరిజం విభాగాల్లో విశేష ఆదరణ లభిస్తోందని జూపల్లి కృష్ణారావు తెలిపారు.

పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, సందర్శకులకు మెరుగైన అనుభూతి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెప్పారు.

ఈ అవార్డును తెలంగాణ ప్రజలకు, పర్యాటక, హోటల్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ అంకితం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

తెలంగాణకు మరో గౌరవం

దేశవ్యాప్తంగా పర్యాటక రంగంలో అత్యుత్తమ సేవలు, గమ్యస్థానాల అభివృద్ధి, సందర్శకులకు అందించే అనుభవాలను గుర్తిస్తూ ఇండియా టుడే టూరిజం అవార్డ్స్ ప్రతి ఏడాది ప్రదానం చేస్తారు.

ఈ ఏడాది హైదరాబాద్‌కు నేషనల్ కలినరీ డెస్టినేషన్ అవార్డు రావడం తెలంగాణ పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవంగా నిలిచింది.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »