NMDC హైదరాబాద్ మారథాన్లో పాల్గొనే రన్నర్ల ప్రయాణ సౌకర్యం కోసం హైదరాబాద్ మెట్రో ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 30, 2026న జరిగే మారథాన్ సందర్భంగా తెల్లవారుజామునే మియాపూర్, ఎల్బీ నగర్, నాగోల్, రాయదుర్గ్ స్టేషన్ల నుంచి రైలు సర్వీసులు నడపనున్నారు.
రేసు రోజు రోడ్లపై ప్రయాణ ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు లేకుండా రన్నర్లు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హాఫ్ మారథాన్ రన్నర్లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కు, 10K రన్నర్లు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కు చేరుకునేందుకు ప్రత్యేక టైమ్టేబుల్ను విడుదల చేశారు.
ఏ లైన్లో ఏ స్టేషన్కు వెళ్లాలి?
రెడ్ లైన్లో మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వైపు ప్రయాణించే రన్నర్లు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్కు నేరుగా చేరుకోవచ్చు. బ్లూ లైన్లో నాగోల్ నుంచి రాయదుర్గ్ వైపు ప్రయాణించే వారు అమీర్పేట్ స్టేషన్లో ఇంటర్చేంజ్ చేసుకుని ఖైరతాబాద్ చేరుకోవాల్సి ఉంటుంది.
అదే విధంగా 10K రన్నర్లు హైటెక్ సిటీకి చేరుకోవడానికి నాగోల్-రాయదుర్గ్ మధ్య నడిచే బ్లూ లైన్ను నేరుగా వినియోగించుకోవచ్చు. మియాపూర్-ఎల్బీ నగర్ రెడ్ లైన్లో ప్రయాణించే వారు అమీర్పేట్లో బ్లూ లైన్కు మారి హైటెక్ సిటీకి చేరుకోవచ్చు.
మియాపూర్ నుంచి ప్రత్యేక సర్వీసుల సమయాలు
మియాపూర్ నుంచి బయలుదేరే ప్రత్యేక రైళ్లలో తొలి రెండు సర్వీసులు హాఫ్ మారథాన్ రన్నర్లకు ఖైరతాబాద్ చేరుకునేందుకు ఉపయోగపడనున్నాయి.
ఉదయం 4:10 గంటలకు: అమీర్పేట్ 4:30, ఖైరతాబాద్ 4:36
ఉదయం 4:20 గంటలకు: అమీర్పేట్ 4:40, ఖైరతాబాద్ 4:46
ఉదయం 4:55 గంటలకు: అమీర్పేట్ 5:15, హైటెక్ సిటీ 5:35
ఉదయం 5:05 గంటలకు: అమీర్పేట్ 5:23, హైటెక్ సిటీ 5:45
ఎల్బీ నగర్ నుంచి రన్నర్ల ప్రయాణం
ఎల్బీ నగర్ నుంచి ఉదయం 4:10, 4:20 గంటలకు బయలుదేరే సర్వీసులు ఖైరతాబాద్కు రన్నర్లను చేరవేస్తాయి.
4:10 సర్వీస్: ఖైరతాబాద్కు 4:33
4:20 సర్వీస్: ఖైరతాబాద్కు 4:43
4:45 సర్వీస్: అమీర్పేట్ 5:14, హైటెక్ సిటీ 5:35
4:55 సర్వీస్: అమీర్పేట్ 5:24, హైటెక్ సిటీ 5:45
నాగోల్, రాయదుర్గ్ నుంచి కూడా ప్రత్యేక సర్వీసులు
బ్లూ లైన్లో నాగోల్ నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. నాగోల్ నుంచి 4:00, 4:10 గంటలకు బయలుదేరే రైళ్లు వరుసగా 4:36, 4:46 గంటలకు ఖైరతాబాద్కు చేరుకుంటాయి.
10K రన్నర్ల కోసం నాగోల్ నుంచి ఉదయం 4:50 గంటలకు బయలుదేరే రైలు 5:35 గంటలకు, ఉదయం 5 గంటలకు బయలుదేరే రైలు 5:45 గంటలకు హైటెక్ సిటీ చేరుకోనుంది.
రాయదుర్గ్ నుంచి కూడా తెల్లవారుజామున ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు. ఉదయం 4:05 గంటలకు బయలుదేరే రైలు 4:36 గంటలకు ఖైరతాబాద్కు, ఉదయం 4:15 గంటల సర్వీస్ 4:46 గంటలకు ఖైరతాబాద్కు చేరుకుంటుంది.
మారథాన్లో వేలాది మంది పాల్గొనే అవకాశం ఉండటంతో రేసు రోజు ప్రయాణానికి ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. మెట్రో ప్రయాణానికి డిజిటల్ QR టికెట్, స్మార్ట్ కార్డ్ లేదా NCMC కార్డు మాత్రమే అంగీకరించబడుతుందని స్పష్టం చేశారు.
ఆగస్టు 30న తెల్లవారుజామున మెట్రో ప్రయాణానికి సంబంధించిన డిజిటల్ టికెట్లను ఆగస్టు 30 వరకు T-Savari యాప్ ద్వారా ముందుగానే కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. చివరి నిమిషంలో టికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా ముందుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
స్టాండర్డ్ మెట్రో చార్జీలే వర్తిస్తాయి. రేసు రోజు తమ శక్తిని ప్రయాణంపైన కాకుండా పరుగు పైనే కేంద్రీకరించేందుకు, వ్యక్తిగత వాహనాల కంటే మెట్రో ప్రయాణాన్ని రన్నర్లు వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు.


