పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన గ్యాస్ సరఫరా సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కమర్షియల్ ఎల్పీజీ కోటాను 20 శాతం పెంచుతూ సరఫరాను క్రమంగా సాధారణ స్థితికి తీసుకువస్తోంది.
భారతదేశంలో ఇంధన రంగం క్రమంగా స్థిరపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గత కొన్ని వారాలుగా ఎల్పీజీ దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయాలను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మక చర్యలు చేపట్టింది.
దేశీయంగా గ్యాస్ ఉత్పత్తి పెరగడం, అలాగే విదేశాల నుంచి దిగుమతులు మెరుగుపడటంతో కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను పెంచాలని నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 20 శాతం కమర్షియల్ ఎల్పీజీ కేటాయింపును ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో మొత్తం సరఫరా ఇప్పుడు సంక్షోభానికి ముందు ఉన్న స్థాయిలో దాదాపు 50 శాతానికి చేరుకుంది.
నిర్ధిష్ట రంగాలకి మాత్రమే పంపిణీ
పెంచిన ఈ ఎల్పీజీ కోటాను ప్రాధాన్యత క్రమంలో నిర్దిష్ట రంగాలకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ఆహార రంగానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఆహార ఉత్పత్తుల తయారీ కేంద్రాలైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పారిశ్రామిక క్యాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లకు కూడా ప్రాధాన్యత కేటాయించబడింది. అదనంగా వలస కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పంపిణీ ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందించింది.
నిబంధనలతో అదనపు కేటాయింపులు
ప్రారంభంలో గృహ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కమర్షియల్ వినియోగంపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని సడలించింది.
అయితే ఈ అదనపు గ్యాస్ కేటాయింపులు పొందాలనుకునే వాణిజ్య సంస్థలు కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఆయిల్ కంపెనీల వద్ద నమోదు చేసుకోవడంతో పాటు పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ కోసం దరఖాస్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఒక క్లిక్తో రూ.12 లక్షలు గల్లంతు.. సైబర్ మోసగాళ్ల బారిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు
దీర్ఘకాలంలో ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
హోమ్ డెలివరీలు యథావిధిగా
ఇక గ్యాస్ కొరత భయంతో గతంలో పెరిగిన పానిక్ బుకింగ్స్ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. హోమ్ డెలివరీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ప్రజలు అనవసరంగా గుమికూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ప్రస్తుతం గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరా పూర్తిగా స్థిరంగా ఉండగా, ఎక్కడా కొరత ఉన్నట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు. పరిశ్రమలకు కూడా వారి సాధారణ సరఫరాలో సుమారు 80 శాతం గ్యాస్ అందుతోంది.
అక్రమ నిల్వలపై చర్యలు
ఇక ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా కొన్ని రాష్ట్రాలకు అదనపు కిరోసిన్ను కూడా కేంద్రం సరఫరా చేస్తోంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకుంటోంది.
దేశవ్యాప్తంగా నిర్వహించిన సుమారు 3,500 దాడుల్లో 1,400 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పంపిణీ వ్యవస్థను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.
త్వరలోనే సాధారణ స్థితికి
అదేవిధంగా పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఉన్న భారతీయ నౌకలు, నావికులు సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, వంట గ్యాస్ కొరతకు దీర్ఘకాలిక పరిష్కారంగా ‘వేస్ట్-టు-గ్యాస్’ మోడల్ను ప్రోత్సహించాలని సూచనలు వస్తున్నాయి. సేంద్రియ వ్యర్థాల నుంచి బయోగ్యాస్ తయారు చేసే విధానాన్ని విస్తరించడం ద్వారా ఎల్పీజీపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మొత్తంగా, కేంద్రం తీసుకున్న తాజా చర్యలతో ఇంధన సరఫరా పరిస్థితులు త్వరలోనే పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది.


