ఉగ్ర ముప్పు హెచ్చరిక.. ఎర్రకోట,ప్ర‌ముఖ ఆల‌యాలు లక్ష్యంగా లష్కరే కుట్ర?

దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రదాడులకు కుట్ర జరుగుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా సంస్థ, ఎర్రకోట, చాందినీ చౌక్ ఆలయం సహా దేశవ్యాప్తంగా ప్రముఖ మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని అడ్వాన్స్‌డ్ ఐఈడీ దాడులకు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజధానిలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.

Delhi Terror Threat
Image credit by adobe stock

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఉగ్ర ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద సంస్థ ల‌ష్కరే తోయిబా భారీ దాడులకు కుట్ర పన్నినట్లు భద్రతా సంస్థలు కీలక సమాచారాన్ని సేకరించాయి. నిఘా వర్గాల ప్రకారం, ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్ర‌కోట సమీప ప్రాంతాలు, రద్దీగా ఉండే చాందినీ చౌక్‌ Chandni Chowkలోని ఆలయాలు, అలాగే దేశవ్యాప్తంగా ప్రముఖ మతపరమైన ప్రదేశాలే ప్రధాన లక్ష్యాలుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. అడ్వాన్స్‌డ్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైసెస్ (IEDs) ద్వారా విధ్వంసం సృష్టించే యత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ప్రతీకారమే కారణమా?

ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మృతి చెందగా, 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకునేందుకే భారత్‌లో రద్దీ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ అంశంపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు.

నవంబర్ 10 కారు బాంబు దాడి జ్ఞాపకం

రాజధానిలో ఉగ్రవాదుల కదలికలు కొత్తేమి కావు. గత ఏడాది నవంబర్ 10న ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా, 24 మందికి పైగా గాయపడ్డారు. దర్యాప్తులో భాగంగా ఫరీదాబాద్‌లోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడినట్లు డీఎన్ఏ పరీక్షల ద్వారా తేలినట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజు ఫరీదాబాద్‌లో 2,900 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది.

ఈ కేసులో కీలక సభ్యులైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ ఆదిల్ రాథర్‌లను భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వీరి అరెస్టులతో భయాందోళనకు గురైన ఉమర్ మొహమ్మద్ ఆవేశంలో కారు బాంబు దాడికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. విద్యావంతులైన వైద్యులు ఉగ్రవాద బాట పట్టడం భద్రతా వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.

హై అలర్ట్‌లో భద్రతా వ్యవస్థ

తాజా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలు, మార్కెట్లు, పర్యాటక కేంద్రాల్లో అదనపు బలగాలను మోహరించారు. సీసీటీవీ పర్యవేక్షణను పెంచి, అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.రాజధానిలో ఉగ్ర ముప్పు హెచ్చరికల నేపథ్యంలో భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉండగా, కేంద్ర మరియు రాష్ట్ర యంత్రాంగాలు సమన్వయంతో పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.

About Author:

Gujja Raju

గత 3 సంవత్సరాలుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్ట్ Gujja Raju. ప్రముఖ తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ Times Telugu మరియు లోకల్ న్యూస్ మీడియా సంస్థల్లో పనిచేసి వార్తా రచనలో అనుభవాన్ని సంపాదించారు. ప్రస్తుతం ప్రముఖ…

More About Author »