జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీప బైసారన్ మైదానంలో 2025 ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపేసిన ఘోర ఘటనగా నిలిచింది. లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’ ఉగ్రవాదులు మతపరమైన గుర్తింపుతో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
ఈ దారుణంలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక వ్యక్తి కలిపి మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబ సభ్యుల కళ్ల ముందే ప్రియమైన వారిని కోల్పోయిన బాధ… ఇప్పటికీ బాధితులను వెంటాడుతూనే ఉంది.
ఏడాది గడిచినా… మానని గాయం
ఈ ఘటనకు ఏడాది పూర్తవుతున్నప్పటికీ, బాధిత కుటుంబాల బాధ ఏమాత్రం తగ్గలేదు. ప్రాణాలతో బయటపడ్డ వారు ఇప్పటికీ ఆ పీడకలని మరచిపోలేకపోతున్నారు. ప్రతి చిన్న సమాచారం, వార్త, సోషల్ మీడియా పోస్టు… ఆ రోజు జరిగిన ఘోరాన్ని మళ్లీ కళ్ల ముందుకు తీసుకువస్తోంది.
ఐషాన్య పోరాటం… న్యాయం కోసం
కాన్పూర్కు చెందిన వ్యాపారవేత్త శుభం ద్వివేది భార్య ఐషాన్య కథ హృదయ విదారకం. పెళ్లై కేవలం రెండు నెలలకే తన భర్తను కళ్ల ముందే కోల్పోయింది. ఆమెను కూడా చంపమని వేడుకున్నా… ఉగ్రవాదులు వదిలేశారు.
ప్రస్తుతం అత్తమామలతో కలిసి జీవిస్తున్న ఆమె… “శుభంను గుర్తు చేసుకోని రోజు లేదు” అంటోంది. బాధితులకు అమరవీరుల హోదా, ప్రభుత్వ ఉద్యోగం వంటి డిమాండ్లు నెరవేరాలని ఆమె కోరుతోంది. “ఇతరులకు ఈ ఘటన మరుగున పడిపోయి ఉండవచ్చు… కానీ మా బాధ మాత్రం అలాగే ఉంది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
మౌనంగా బాధను మోస్తున్న కుటుంబాలు
జైపూర్కు చెందిన నీరజ్ ఉధ్వానీ కుటుంబం ఈ విషాదాన్ని మౌనంగా భరిస్తోంది. అతని 70 ఏళ్ల తల్లి ఇంటి నుంచే బయటకు రావడం మానేసింది. కుటుంబ సభ్యులు ఆ జ్ఞాపకాలను మళ్లీ తలుచుకోకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
గుజరాత్లోని భావ్నగర్లో పర్మార్ కుటుంబం కూడా ఈ దాడిలో తండ్రి, కుమారుడిని కోల్పోయింది. ఈ ఘటన తర్వాత వారి జీవితం పూర్తిగా మారిపోయింది. కలిసి ప్రయాణాలు చేయడం మానేశారు. ప్రమాదాలకు దూరంగా ఉంటూ జాగ్రత్తగా జీవిస్తున్నారు.
మనోవేదనలో భరత్ కుటుంబం
బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ కుటుంబం కూడా ఈ దాడితో ఛిన్నాభిన్నమైంది. కుటుంబంతో కలిసి వెళ్లిన విహారయాత్రలో అతను ప్రాణాలు కోల్పోయాడు. చివరి క్షణాల్లో తన కుటుంబం క్షేమం కోసం వేడుకున్నాడని ఆయన భార్య సుజాత గుర్తు చేసుకుంటోంది. భర్తతో కలిసి ప్రారంభించాలని అనుకున్న క్లినిక్ను ఇప్పుడు ప్రారంభించాలనే ఆశతో ఆమె జీవనం కొనసాగిస్తోంది.
మానసిక ఆఘాతం వెంటాడుతోంది
ఇండోర్కు చెందిన జెన్నిఫర్ కథ మరింత విషాదకరం. తన భార్యని రక్షించేందుకు ప్రయత్నించిన అతను చివరకు ఆమె కళ్ల ముందే కాల్పులకు గురయ్యాడు. ఆ ఘటన తర్వాత ఆమె పూర్తిగా మానసికంగా కుంగిపోయింది.ఆమె కొడుకు ఆస్టెన్ ఇప్పుడు కుటుంబ బాధ్యతలు మోస్తూ… తన చదువు, భవిష్యత్ ప్రణాళికలను పక్కన పెట్టాడు. కుటుంబానికి తోడుగా ఉండేందుకు అతని సోదరి కూడా ఇంటికి వచ్చేసింది.
ఆపరేషన్ సింధూర్… ప్రతీకారం
ఈ దాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై కఠిన చర్యలు చేపట్టింది. “ఆపరేషన్ సింధూర్” ద్వారా ఉగ్రవాదులను హతమార్చి, వారికి సహకరించిన వారిని అరెస్టు చేసింది. దేశం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని స్పష్టంగా అమలు చేసింది.
ఏడాది గడిచినా… బాధిత కుటుంబాల జీవితాల్లో ఆ రోజు ఆగిపోయినట్టే ఉంది. కొందరు న్యాయం కోసం ఎదురుచూస్తుండగా… మరికొందరికి సాధారణ జీవితం కొనసాగించడమే ఒక పెద్ద సవాలుగా మారింది. పహల్గామ్ పచ్చిక బయళ్ళు తిరిగి ప్రశాంతంగా కనిపిస్తున్నా… అక్కడ జరిగిన ఆ దారుణం… బాధితుల గుండెల్లో మాత్రం ఎప్పటికీ చెరిగిపోని గాయంగా మిగిలిపోయింది.
Also Read:


