- భారత ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి
- ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో తల్లి ఫోన్ రావడంతో స్పందించి, ఐదు నిమిషాల్లో తిరిగి మాట్లాడుతానని చెప్పారు
- భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం ధర్మశాలలో
ఆటలో మెరిసిన నితీశ్.. ప్రెస్ మీట్లో హృదయాలను గెలుచుకున్నాడు
క్రీడాకారుల జీవితాల్లో కుటుంబం ఎంత ముఖ్యమో మరోసారి నిరూపించిన సంఘటన ఇది. భారత్-అఫ్గానిస్థాన్ తొలి వన్డే తర్వాత జరిగిన మీడియా సమావేశంలో భారత యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
జర్నలిస్టులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో నితీశ్ ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గుర్తించిన ఆయన, వెంటనే ఫోన్ ఎత్తి.. “అమ్మా.. నేను ఇప్పుడు ప్రెస్ మీట్లో ఉన్నాను. మరో ఐదు నిమిషాల్లో తిరిగి మాట్లాడుతాను” అని చెప్పి కాల్ ముగించారు.
ఇవి కూడా చదవండి
అనంతరం మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పి మళ్లీ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఈ హృద్యమైన సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Priorities, no matter your age or occupation 😂💗 pic.twitter.com/mBWkO6Sq8n
— Rajasthan Royals (@rajasthanroyals) June 13, 2026
వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన మ్యాచ్
ధర్మశాలలో శుక్రవారం జరిగిన తొలి వన్డే వర్షం కారణంగా 25 ఓవర్ల మ్యాచ్గా మారింది. టాస్ గెలిచిన భారత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఆరంభంలోనే అఫ్గానిస్థాన్ను భారత్ కట్టడి చేసింది. జట్టు స్కోరు 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ అద్భుతంగా ఆడుతూ ఎదురుదాడికి దిగాడు.
కెప్టెన్ హష్మతుల్లా షాహిదీతో కలిసి నాలుగో వికెట్కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. గుర్బాజ్ సెంచరీతో మెరిసినా, భారత బౌలర్లు చివర్లో పుంజుకుని అఫ్గానిస్థాన్ను 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ చేశారు.
అరంగేట్ర బౌలర్ల అదరగొట్టిన ప్రదర్శన
భారత్ తరఫున అరంగేట్రం చేసిన గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే ఆకట్టుకున్నారు. గుర్నూర్ 3 వికెట్లు, హర్ష్ దూబే మరో మూడు వికెట్లు తీసి అఫ్గానిస్థాన్ను కట్టడి చేశారు.
నితీశ్ కుమార్ రెడ్డి కూడా బంతితో మెరిశాడు. నాలుగు ఓవర్లు వేసి 31 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. సెంచరీ చేసిన గుర్బాజ్తో పాటు అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ వికెట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
బ్యాటింగ్లో గిల్ షో.. భారత్కు సులువైన విజయం
195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు రోహిత్ శర్మ వేగవంతమైన ఆరంభం ఇచ్చాడు. అయితే 16 పరుగుల వద్ద అతను ఔటయ్యాడు.
ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 66 బంతుల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇషాన్ కిషన్ 34 పరుగులు, కేఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు.
భారత్ 22.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు..
గత ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్కు ఎంపికయ్యాడు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ తన సత్తా చాటుతూ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు.
అయితే ధర్మశాల మ్యాచ్ తర్వాత చర్చ అంతా అతని ఆట గురించే కాదు.. తల్లి ఫోన్కు ఇచ్చిన ప్రాధాన్యత గురించే సాగుతోంది.
మైదానంలో ఎంత పెద్ద ఆటగాడైనా.. అమ్మ ఫోన్ వస్తే ముందుగా స్పందించే కొడుకే అన్న భావనతో అభిమానులు సోషల్ మీడియాలో నితీశ్ను ప్రశంసిస్తున్నారు.


