ఐసీసీ మెన్స్ టీ20 వరల్ట్ కప్ 2026 డిజిటల్ ప్లాట్ఫామ్స్లో అద్భుతమైన స్పందనను నమోదు చేస్తోంది. ముఖ్యంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సూపర్ 8 పోరు లైవ్ స్ట్రీమింగ్లో ఆల్టైమ్ రికార్డులను తిరగరాసింది. గతంలో ఐసీసీ మెన్స్ టీ20 వరల్ట్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నమోదైన అత్యధిక కాంకరెంట్ వ్యూస్ (ఒకేసారి మ్యాచ్ వీక్షించిన వారి సంఖ్య) రికార్డును ఈ మ్యాచ్ అధిగమించడం విశేషం.
ఐసీసీ.టీవీలో భారీ పెరుగుదల
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ మెగా టోర్నీ డిజిటల్ ఎంగేజ్మెంట్ పరంగా మునుపెన్నడూ లేని స్థాయిలో దూసుకుపోతోంది. అధికారిక స్ట్రీమింగ్ వేదిక ICC.tvలో ఇప్పటికే 2024 టోర్నీ మొత్తం గణాంకాలను మించిపోయిన వ్యూస్ నమోదయ్యాయి.
Also Read: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం క్రీడారంగంపై కూడా.. మెస్సీ, రొనాల్డో, హామిల్టన్ షెడ్యూల్స్ గందరగోళం
గత ప్రపంచకప్తో ఇదే సమయానికి పోలిస్తే:
- యూనిక్ యూజర్లు 28% పెరిగారు
- మొత్తం వాచ్ టైమ్ 56% వృద్ధి చెందింది
- ఒక్కో యూజర్ సగటు వీక్షణ సమయం 47 నిమిషాల నుంచి 58 నిమిషాలకు పెరిగింది
- ఈ గణాంకాలు క్రికెట్ అభిమానులు మ్యాచ్లను మరింత సమయం కేటాయించి ఆస్వాదిస్తున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
- సోషల్ మీడియాలో 10 బిలియన్ మార్క్ దాటిన వీడియో వ్యూస్
సోషల్ మీడియా వేదికలలో కూడా టీ20 వరల్డ్కప్ హవా కొనసాగుతోంది. ఐసీసీ అధికారిక హ్యాండిల్స్లో వీడియో వ్యూస్ ఇప్పటికే 10 బిలియన్ మార్క్ను దాటాయి. హైలైట్స్, షార్ట్ క్లిప్స్, ప్లేయర్ రియాక్షన్స్, ఫ్యాన్ మూమెంట్స్కు విశేష స్పందన లభిస్తోంది.
ఇంగ్లీష్యేతర భాషలకు భారీ ఆదరణ
ఈసారి టోర్నీలో ఇంగ్లీష్యేతర భాషల ఫీడ్స్కు అద్భుతమైన ఆదరణ లభించడం గమనార్హం. మొత్తం ప్లే-టైమ్లో సగానికి పైగా వాటా హిందీ, ఉర్దూ, నేపాలీ, జపనీస్ వంటి భాషలదే కావడం విశేషం. ఇది క్రికెట్ అభిమానుల విస్తృతిని, ప్రాంతీయ భాషల్లో కంటెంట్పై ఉన్న ఆసక్తిని సూచిస్తోంది.
కొత్త మార్కెట్లలో క్రికెట్ జోరు
క్రికెట్కు సంప్రదాయ మార్కెట్లు కాని దేశాల్లో కూడా ఈ టోర్నీ భారీ వృద్ధిని నమోదు చేసింది:
- జర్మనీ – 150% వృద్ధి
- ఇటలీ – 136% పెరుగుదల
- జపాన్, దక్షిణ కొరియా – 100%కు పైగా వ్యూయర్షిప్ పెరుగుదల
ఈ గణాంకాలు క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయాలన్న ఐసీసీ లక్ష్యానికి బలమైన మద్దతుగా నిలుస్తున్నాయి.
మొత్తానికి, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2026 కేవలం మైదానంలోనే కాదు, డిజిటల్ ప్రపంచంలో కూడా కొత్త ప్రమాణాలను సృష్టిస్తోంది. భారత్-వెస్టిండీస్ మ్యాచ్తో మొదలైన ఈ డిజిటల్ సంచలనం టోర్నీ ముగిసే నాటికి మరిన్ని రికార్డులు తిరగరాసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.