తెలంగాణ రెవెన్యూశాఖలో అదనపు కలెక్టర్ల బదిలీ.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు..!

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ (Revenue Department)లో విస్తృత స్థాయిలో బదిలీలు చేపట్టింది. ఈ మేరకు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పలువురు అదనపు కలెక్టర్లు (Additional Collectors), జిల్లా రెవెన్యూ అధికారులు (District Revenue Officers), డిప్యూటీ కలెక్టర్లకు పోస్టింగులు ఇచ్చింది.

Telangana Logo
Telangana Govt Appoints Heads to 18 Corporations

Transfers in Revenue | రెవెన్యూశాఖలో పలువురు అదనపు కలెక్టర్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లకు బదిలీలు, పోస్టింగ్‌లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. వరంగల్‌ అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న గట్టు సంధ్యారాణిని నిర్మల్‌ అదనపు కలెక్టర్‌గా సర్కారు బదిలీ చేసింది. నిర్మల్‌లో పనిచేస్తున్న ఎల్‌ కిశోర్‌కుమార్‌ను వరంగల్‌ బాధ్యతలు అప్పగించింది. సిద్ధిపేట ఎస్‌డీసీ (ఎల్‌ఏ)గా ఉన్న డీ నాగరాజమ్మకు సిద్ధిపేట డీఆర్‌వోగా పోస్టింగ్‌ ఇచ్చింది.

Read Also : తొలిసారిగా ఢిల్లీ రోడ్లపై హైడ్రోజన్‌ బస్సులు.. పర్యావరణ హిత రవాణాలో తొలి అడుగు..!

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో డిప్యూటేషన్‌పై ఉన్న ఆర్‌ దశరథ్‌ను నల్గొండ డీఆర్‌వోగా నియమిస్తూ ఆదేశాలిచ్చింది. మేడ్చల్‌ మల్కాజిగిరి ఎస్‌డీసీ (ఎల్‌ఏ-ఇండస్ట్రీస్‌)గా ఉన్న మాలతి సముద్రాలను మేడ్చల్‌ డీఆర్‌వోగా బదిలీ అయ్యారు. మైనారిటీస్‌ వెల్ఫేర్‌ శాఖలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న టీఏవీ నాగలక్ష్మిని మహబూబాబాద్‌ డీఆర్‌వోగా నియమించింది. రవాణా, ఆర్‌అండ్‌బీ (హౌసింగ్‌) శాఖలో ప్రాజెక్టు డైరెక్టర్‌గా ఉన్న ఎంవీ రవీంద్రనాథ్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హౌసింగ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా కొనసాగించింది. మహబూబాబాద్‌ డీఆర్‌వో పని చేస్తూ పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న జుబేదున్నీసా బేగంను మైనారిటీస్‌ వెల్ఫేర్‌ శాఖ పరిధిలోని తెలంగాణ స్టేట్‌ వక్ఫ్‌ ట్రైబ్యునల్‌లో మెంబర్‌ (రెవెన్యూ)గా ఏడాది పాటు డిప్యూటేషన్‌పై నియమించారు.

Read Also : స్విట్జర్లాండ్‌లోనే హనీమూన్‌ షూట్‌ చేయాలా..? నిర్మాతలను కడిగిపారేసిన కమల్‌ హసన్‌..!

హనుమకొండ ఆర్డీవో రాథోడ్‌ రమేశ్‌ను నిర్మల్‌ డీఆర్‌వోగా, జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో డిప్యూటేషన్‌పై ఉన్న డీ ప్రేమ్‌రాజ్‌ను సూర్యాపేట డీఆర్‌వోగా ప్రభుత్వం పోస్టింగ్‌ ఇచ్చింది. ఇదిలా ఉండగా.. జిల్లాల్లో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. భూ వివాదాల పరిష్కారం, పరిపాలన, తదితర కీలక బాధ్యతల దృష్ట్యా అధికారులను వివిధ జిల్లాలకు కేటాయించినట్లు సమాచారం. ఇంకా పలు విభాగాల్లో పోస్టింగ్‌లు, బదిలీలు జరిగే అవకాశమున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Read Also : ఒకే కుటుంబంలో తండ్రీ కొడుకులకు కిసాన్‌ సమ్మానిధి వస్తుందా..? త్వరలోనే రైతుల ఖాతాల్లోకి 23వ విడత నిధులు..!

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »