హైదరాబాద్: కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగా, కులాల డేటా లేకుండా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) చేపడితే దక్షిణ రాష్ట్రాల ఉనికి ప్రమాదంలో పడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మార్పులో ముందున్న దక్షిణ రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కేంద్రం పన్నుల వాటాలో కోత విధిస్తోందని ఆయన మండిపడ్డారు.
భట్టి విక్రమార్క ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
1. పన్నుల వాటాలో వివక్ష: తెలంగాణ ప్రతి రూపాయి ఆదాయాన్ని కేంద్రానికి ఇస్తే, తిరిగి రాష్ట్రానికి వస్తోంది కేవలం ₹0.37 మాత్రమేనని భట్టి వివరించారు. ఇదే సమయంలో బీహార్కు ₹6.53, ఉత్తరప్రదేశ్కు ₹2.17 అందుతున్నాయని, ఈ వివక్షను ప్రజలు గమనించాలని కోరారు.
2. కుల గణన – రిజర్వేషన్లు: బ్రిటిష్ కాలం తర్వాత కుల గణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన గుర్తు చేశారు.

సర్వేలో 56% బీసీ జనాభా ఉన్నట్లు తేలిందని, దీని ఆధారంగా స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేసిందని తెలిపారు. ఈ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద పెండింగ్లో ఉందన్నారు.
3. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు:
- జ్యోతిరావు ఫూలే ఆశయాల సాధనలో భాగంగా విద్యా రంగానికి బడ్జెట్లో 13.5% కేటాయించామని భట్టి తెలిపారు.
- యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్: అన్ని వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేలా వీటిని ఏర్పాటు చేస్తున్నాం.
- డైట్ చార్జీల పెంపు: విద్యార్థుల డైట్ చార్జీలను 40%, కాస్మెటిక్ చార్జీలను 200% పెంచాం.
- బ్రేక్ ఫాస్ట్ స్కీమ్: జూన్ 2 నుండి 20 లక్షల మంది విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం కానుంది.
- తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: ప్రతి నియోజకవర్గంలో ₹15 కోట్లతో వీటిని నిర్మిస్తున్నాం.
4. సామాజిక న్యాయం: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ను ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. కుల వృత్తులపై ఆధారపడిన వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు.
Also Read:


