హైదరాబాద్/ఎర్రవెల్లి: గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి చివరకు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈరోజు ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన ఆయనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
భావోద్వేగ భేటీ.. ఆత్మీయ ఆలింగనం:
కేసీఆర్ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “అన్నా.. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పని చేయమని దేవుడే నన్ను మీ దగ్గరకు పంపిండు. చాలా గ్యాప్ తర్వాత మీతో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.
కేసీఆర్ స్పందన: జీవన్ రెడ్డిని అప్యాయంగా దగ్గరకు తీసుకున్న కేసీఆర్, ఆయనను ఆలింగనం చేసుకుని శాలువాతో సన్మానించారు. అనంతరం వారితో కలిసి లంచ్ చేశారు.
Also Read :
కాంగ్రెస్ ప్రయత్నాలు విఫలం:
జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, జిల్లా రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపారు.
దానం నాగేందర్ విమర్శలు:
జీవన్ రెడ్డి నిర్ణయంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందిస్తూ.. “రాజకీయాల్లో భావోద్వేగాలకు లోనై ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత కాంగ్రెస్ను వీడటం బాధాకరం” అని వ్యాఖ్యానించారు.
ముఖ్య నేతల సమక్షంలో..
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి రాకతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ బలం మరింత పెరిగిందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Also Read : “రేవంత్ పాలన అంటేనే రాక్షస పాలన.. బేడీల ప్రభుత్వం”: శంషాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు!


