- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు మరియు అన్ని జిల్లాల కలెక్టర్లు
- వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, విద్యా-వైద్య ప్రమాణాలు మరియు ప్రగతి ప్రణాళికలపై సమీక్షా సమావేశం
- డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం (వీడియో కాన్ఫరెన్స్ ద్వారా)
Collector JS Bhupalpally : రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అభివృద్ధి, ప్రజా సేవలో తమ జిల్లాలను రాష్ట్రానికే ఆదర్శంగా నిలిపేలా కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సచివాలయం నుండి అన్ని శాఖల కార్యదర్శులతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాలనలో సంస్కరణలు, మార్పులతో పాటు అధికారుల పనితీరులో సృజనాత్మకత కనిపించాలని సీఎస్ స్పష్టం చేశారు.
ఇదే సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని” గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు విజయవంతంగా నిర్వహించినందుకు కలెక్టర్లను, జిల్లా యంత్రాంగాన్ని సీఎస్ అభినందించారు. మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
ఎల్ నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటలు, మైక్రో ఇరిగేషన్పై ఫోకస్
ఈ ఏడాది ఎల్ నినో (El Nino) ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో వ్యవసాయ అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎస్ సూచించారు. తక్కువ నీటితో పండే వర్షాభావ ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, అలాగే ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ఆదేశించారు. వ్యవసాయ రంగంలో నీటి వృథాను అరికట్టేందుకు మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ సాగునీరు) పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలో ఈ సీజన్లో 138.49 లక్షల ఎకరాలలో సాగు లక్ష్యంగా నిర్దేశించగా, రైతులకు అవసరమైన మేరకు 99.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నకిలీ విత్తనాలపై నిఘా పెంచి, ఇప్పటివరకు 510.93 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకుని, 68 మందిని అరెస్ట్ చేశామని, 34 క్రిమినల్ కేసులు నమోదు చేశామని వెల్లడించారు. యూరియాకు ప్రత్యామ్నాయంగా ‘నానో యూరియా’ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, యూరియా అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
విద్యా, వైద్య రంగాల్లో ఆకస్మిక తనిఖీలు
రాష్ట్రంలో విద్యా, వైద్య ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎస్ సంజయ్ జాజు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్లు స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ విద్యాలయాలు, ఆశ్రమ పాఠశాలలు, విద్యుత్ సబ్ స్టేషన్లను నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని స్పష్టం చేశారు.
గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ప్రసవ తేదీలను ముందే గుర్తించి అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, పరీక్షా కిట్లు, రక్త నిల్వలు, అంబులెన్స్ సేవలు మరియు అత్యవసర చికిత్స సౌకర్యాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
33 జిల్లాల్లో కంట్రోల్ రూములు.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎస్ హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని 33 జిల్లాలలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామని, జిల్లా, డివిజన్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) స్థాయిలలో ‘ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్లు’ (Rapid Response Teams) సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న హై-రిస్క్ ప్రాంతాలలో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
వీటితో పాటు, జిల్లాలలో ఉన్న పర్యాటక ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యత గల ప్రదేశాలను గుర్తించి, వాటి సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లను ఆదేశించారు.


