కొత్తగూడెం కార్పొరేషన్ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ .. కేటీఆర్ నిర్ణయంపై అంతర్గత చర్చ

కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐకి ముందస్తుగా మద్దతు ప్రకటించిన నిర్ణయం బీఆర్‌ఎస్‌లోనే చర్చనీయాంశమైంది. సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకోవడంతో రాజకీయ లెక్కలు తారుమారయ్యాయి. ఇప్పుడు ఈ విష‌యం రాజ‌కీయాల‌లో హాట్ టాపిక్ అయింది.

Kothagudem Mayor Election Row

కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీసుకున్న తాజా నిర్ణయం పార్టీ అంతర్గత వర్గాల్లోనే చర్చకు దారితీసింది. సీపీఐ అధికారికంగా మద్దతు కోరకముందే బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎనిమిది మంది కార్పొరేటర్ల మద్దతును ప్రకటించడం వ్యూహాత్మక పొరపాటుగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాల మధ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం బీఆర్‌ఎస్ మద్దతును పరిగణనలోకి తీసుకోకుండా తమ మిత్రపక్షమైన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తో చర్చలు జరిపి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకునే దిశగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. దీంతో బీఆర్‌ఎస్ వ్యూహం ఫలించలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Also Read: మూసీ ప్రక్షాళనకు శ్రీకారం: మూడు జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం!

బెడిసి కొట్టింది..

రాజకీయాల్లో మద్దతు ప్రకటించడం ఒక కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న సమయంలో, ప్రత్యర్థులుగా పోటీ చేసిన పార్టీకే ముందుగానే మద్దతు ఇవ్వడం రాజకీయంగా ప్రమాదకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత రాష్ట్ర సమితి వర్గాల్లో కూడా ఈ అంశంపై అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్తగూడెం స్థానిక రాజకీయ సమీకరణాలపై సరైన అవగాహన లేకుండానే త్వరిత నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీపీఐను కాంగ్రెస్‌కు దూరం చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ఈ నిర్ణయం చివరికి ఫలించలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో చోటుచేసుకున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో సీపీఐ బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉండడానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ పరిణామాల తర్వాత కొత్తగూడెం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్ ప్రభావం ఎంతవరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయాల్లో వ్యూహం, సమయం, మిత్రపక్షాల లెక్కలు కీలకమని ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »