ఆస్తిపన్ను ఎగవేతదారులపై జీహెచ్‌ఎంసీ కొరడా.. ఇంటికొచ్చి నోటీసులిస్తామంటూ హెచ్చ‌రిక‌

GHMC ఆస్తిపన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు చేపడుతోంది. మార్చి 1 తర్వాత జరిమానాలు, ఇంటివద్ద నోటీసులు జారీ చేయనున్నట్లు హెచ్చరించింది.

GHMC officials issuing property tax notices to homeowners in Hyderabad
  • ఆస్తిపన్ను ఎగవేతదారులపై GHMC కఠిన చర్యలు చేపడుతోంది

  • మార్చి 1 తర్వాత భారీ జరిమానాలు, నోటీసులు అమలు

  • స్వచ్ఛందంగా వివరాలు సవరించుకుంటే పెనాల్టీ నుంచి ఉపశమనం

మీ ఇంటి లేదా వ్యాపార సంస్థకు సంబంధించిన ఆస్తిపన్నును సక్రమంగా చెల్లిస్తున్నారా? అనుమతి తీసుకున్న విస్తీర్ణం కంటే అదనంగా గదులు నిర్మించి ఉపయోగిస్తున్నారా? అయితే వెంటనే అప్రమత్తం కావాల్సిన సమయం ఇది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను ఎగవేతకు పాల్పడుతున్న వారిపై, అలాగే తప్పుడు వివరాలతో తక్కువ పన్ను చెల్లిస్తున్న భవన యజమానులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పన్ను సవరించుకునేందుకు చివరి అవకాశం కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆస్తి వివరాలను స్వచ్ఛందంగా సవరించుకోని యజమానులను గుర్తించి మార్చి 1 నుంచి భారీ జరిమానాలు విధించాలని ఉన్నతాధికారులకు కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఇంటికి అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చేవరకు వేచి చూడకుండా, భవన యజమానులే ముందుకు వచ్చి తమ ఆస్తిపన్ను వివరాలను సరిచేసుకోవాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది. అధికారుల పరిశీలనలో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది భవన యజమానులు అనుమతి పొందిన విస్తీర్ణం కంటే అదనంగా నిర్మాణాలు చేసి వినియోగిస్తున్నప్పటికీ, పన్ను లెక్కల్లో వాటిని చూపడం లేదని తేలింది. మరికొందరు బిల్ కలెక్టర్ల ప్రోత్సాహంతో తక్కువ పన్ను కడుతున్నట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా కమర్షియల్ భవనాల విషయంలో అక్రమాలు ఎక్కువగా జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

⇒ సంజూ శాంసన్ మ‌ళ్లీ ఫెయిల్‌.. ఫామ్‌పై పెరుగుతున్న ఒత్తిడి,సెలెక్షన్‌పై చర్చ

అధికారుల గుర్తించిన ప్రధాన లోపాలు :

అనుమతించిన విస్తీర్ణం కంటే అదనంగా గదులు నిర్మించి వినియోగించడం

నివాస భవనాలను కమర్షియల్‌గా వాడుతున్నప్పటికీ పన్ను లెక్కల్లో చూపకపోవడం

కమర్షియల్ విస్తీర్ణాన్ని తక్కువగా చూపించి ట్రేడ్ లైసెన్స్ చార్జీలను తగ్గించుకోవడం

బిల్ కలెక్టర్లతో కుమ్మక్కై తప్పుడు వివరాలతో తక్కువ పన్ను చెల్లించడం

ఈ నేపథ్యంలో ఆస్తి యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వివరాలను సవరించుకోవాలని జీహెచ్‌ఎంసీ పిలుపునిస్తోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్ పోర్టల్‌లోకి వెళ్లి ‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ ఆప్షన్ ద్వారా సరైన వివరాలు నమోదు చేసి పన్ను చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

ఆస్తిపన్ను సవరణకు చేయాల్సింది ఇదే :

జీహెచ్‌ఎంసీ అధికారిక ఆన్‌లైన్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి

‘సెల్ఫ్ అసెస్‌మెంట్’ ఎంపికను ఎంచుకోవాలి

భవనం విస్తీర్ణం, వినియోగ విధానం వంటి వివరాలను సరిగ్గా నమోదు చేయాలి

సవరించిన పన్నును ఆన్‌లైన్‌లో చెల్లించాలి

మార్చి 1 తర్వాత గుర్తించబడే ఎగవేతదారులపై జరిమానాలతో పాటు బకాయిలను వడ్డీతో సహా వసూలు చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నోటీసుల కోసం ఎదురు చూడకుండా ఇప్పుడే ఆస్తిపన్ను వివరాలను సరిచేసుకోవడం మేలని జీహెచ్‌ఎంసీ స్పష్టం చేస్తోంది.

About Author:

శివం నాగరాణి

గత 4 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. వివిధ దినపత్రికల్లో జర్నలిస్ట్‌గా పని చేశారు. విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు మరియు ప్రజలకు ఉపయోగపడే సమాచార కథనాలు రాస్తున్నారు. Mana Varta లో క్రీడలు, లైఫ్ స్టైల్,…

More About Author »