జగిత్యాలలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్తుపై ఆలోచిస్తున్నానని బహిరంగంగా ప్రకటించారు. ఎమ్మెల్యే సంజయ్ ఉన్నంతకాలం తనకు వేధింపులు తప్పవని ఆయన వ్యాఖ్యానించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.
“ఇది ఎన్నికల ముగింపు కాదు. ఎమ్మెల్యేగా సంజయ్ కొనసాగుతున్నంతకాలం అవమానాలు భరించాల్సిందేనా?” అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల కాంగ్రెస్ పట్టా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రాసిచ్చారా? అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Also Read: కొల్లూరు పోలీస్–SOT సంయుక్త ఆపరేషన్… రూ.25 లక్షల గంజాయి స్వాధీనం, ఇద్దరు అరెస్ట్
స్పీకర్ తీర్పు – నేలపై వాస్తవం?
స్పీకర్ ఎమ్మెల్యే పార్టీ మారలేదని చెబుతున్నా, నేలమీద మాత్రం ఎమ్మెల్యే వ్యవహారం కాంగ్రెస్తోనే ఉందని జీవన్ రెడ్డి ఆరోపించారు. “పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్కు ఇచ్చారా?” అంటూ పార్టీ అధిష్టానాన్ని నిలదీశారు.
జగిత్యాలలో పరిస్థితి ఇలా ఉంటే, పార్టీ మారిన మరో తొమ్మిది ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అధిష్టానం ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలని స్పష్టం చేశారు.
తెలంగాణలో ఇటీవల పార్టీ మార్పుల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. స్పీకర్ తీర్పులు ఒకవైపు ఉంటే, స్థానిక స్థాయిలో అసంతృప్తి మరోవైపు ఉధృతమవుతోంది. ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
జగిత్యాల ఉదంతం కేవలం స్థానిక వివాదమా? లేక రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తున్న అసంతృప్తికి సంకేతమా? అన్నది వచ్చే రోజుల్లో స్పష్టమవుతుంది.