ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీపీఆర్వోగా పనిచేస్తున్న పూడి శ్రీహరిను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పూడి శ్రీహరి వినియోగిస్తున్న సెల్ఫోన్, ల్యాప్టాప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన వైసీపీ మీడియా విభాగం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టింగ్లు చేయించారనే ఆరోపణలతో ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా చంద్రబాబు చేతిలో కత్తి ఉన్నట్లుగా చూపించిన యానిమేషన్ వీడియోను సోషల్ మీడియాలో ప్రచారం చేశారనే ఫిర్యాదుతో చిత్తూరులో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగానే పోలీసులు చర్యలు చేపట్టారు. అంతేకాక మరికొన్ని కేసుల్లో కూడా శ్రీహరిని విచారించే అవకాశముంది.
వైసీపీ తీవ్ర ఆగ్రహం
ఈ అరెస్టుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో, ఏ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తున్నారో తెలియజేయకుండా పోలీసులు వ్యవహరించారని పార్టీ ఆరోపించింది. ‘ఎక్స్’ వేదికగా స్పందించిన పార్టీ, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించింది.
అంబటి రాంబాబు ఖండన
మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కుప్పం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుల పేరుతో చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టి కాంతయ్య దౌర్జన్యంగా పూడి శ్రీహరిను తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. పోలీసుల తీరును ఆయన ఖండించారు.
మొత్తంగా, పూడి శ్రీహరి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో వేడెక్కిన చర్చకు దారితీసింది. ఇది చట్టపరమైన చర్యనా? లేక రాజకీయ ప్రతీకారమా? అన్నది రాబోయే రోజుల్లో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.
Aslo Read:


