TG High Court | రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పెద్ది’ టికెట్ ధరల పెంపు వ్యవహారంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమా విడుదల నేపథ్యంలో ప్రత్యేకంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ఇప్పుడు తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఈ మేరకు దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం, ప్రభుత్వం జారీ చేసిన మెమోపై ప్రాథమిక స్థాయిలోనే పలు సందేహాలు వ్యక్తం చేసింది. సినిమా విడుదల అనంతరం తొలి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతిస్తూ జూన్ 2న హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం ఇప్పటికే అమలులో ఉన్న జీవో-121 నిబంధనలకు, గతంలో హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ న్యాయవాది దాచేపల్లి చంద్రబాబు కోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది విజయ్ గోపాల్.. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. ముఖ్యంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్ ఉద్దేశపూర్వకంగానే న్యాయస్థానం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. టికెట్ ధరల పెంపు విషయంలో ఇప్పటికే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ప్రత్యేక అనుమతులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ ఉత్తర్వులు ప్రాథమికంగా చట్టబద్ధత అంశంలో పరిశీలన అవసరమని అభిప్రాయపడింది. టికెట్ ధరల పెంపు వంటి అంశాల్లో ఇప్పటికే ఉన్న విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు పూర్తి వివరాలు సమర్పించేందుకు కొంత సమయం కావాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం తరచూ చర్చనీయాంశంగా మారుతోంది. స్టార్ హీరోల చిత్రాలకు ప్రత్యేక షోలు, అదనపు టికెట్ రేట్లకు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వడం, వాటిపై న్యాయపరమైన కోర్టుల్లో సవాల్ చేస్తున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ‘పెద్ది’ విషయంలోనూ అదే పరిస్థితి వచ్చింది. హైకోర్టు తుది నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే టికెట్ ధరల వివాదం తెరపైకి రావడం నిర్మాతలు, అభిమానుల్లో చర్చకు దారితీసింది. కోర్టు విచారణ ఫలితం ఆధారంగా టికెట్ ధరల పెంపుపై భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


