హైదరాబాద్ నగర వాసులకు సిటీ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ఫిబ్రవరి 27వ తేదీ నుంచి బంజారాహిల్స్ రోడ్ నెంబర్-2లో ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పలు కీలక జంక్షన్ల వద్ద ట్రాఫిక్ మళ్లింపులు అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ముగ్ద జంక్షన్, కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ పరిసరాల్లో రద్దీ పెరిగే అవకాశమున్నందున తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. పనులు పూర్తయ్యే వరకు ఈ మళ్లింపులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ఎన్ఎఫ్సీఎల్ నుంచి వచ్చే వాహనాలు
శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ద), కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, రోడ్ నెంబర్ 36 & 45, కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్లేవారు శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్ వద్ద మళ్లింపు తీసుకోవాలి.
శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ – ఇందిరానగర్ లేబర్ అడ్డా – జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-5 – వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మార్గం ద్వారా చెక్పోస్ట్ చేరుకోవచ్చు.
Also Read: విడుదల రోజే సేఫ్ జోన్లోకి ‘విష్ణు విన్యాసం’ – థియేటర్లలో పాజిటివ్ టాక్ హిట్!
జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 & 45 నుంచి వచ్చే వాహనాలు
ఎన్ఎఫ్సీఎల్ వైపు వెళ్లేవారు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ – వెంకటగిరి రోడ్ నెంబర్-2 – యూసుఫ్ గూడ బస్తీ – యూసుఫ్ గూడ చెక్పోస్ట్ – మైత్రీవనం – అమీర్పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా – శ్రీనగర్ కాలనీ – పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లవచ్చు.
KCP, బంజారాహిల్స్ రోడ్ నెం.1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేవారు బంజారాహిల్స్ రోడ్ నెంబర్-10 మీదుగా వెళ్లి, క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ – భారతీయ విద్యాభవన్ మార్గం ద్వారా రోడ్ నెంబర్-45 చేరుకోవచ్చు.
మాసబ్ ట్యాంక్ నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లే వారు విరించి హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ – భారతీయ విద్యాభవన్ మార్గాన్ని ఉపయోగించాలి.
రద్దీ సమయాల్లో జాగ్రత్త
ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. సాధ్యమైనంత వరకు ఈ సమయాల్లో ప్రయాణాలు నివారించాలని సూచించారు.
అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలు, సైన్ బోర్డులు తప్పనిసరిగా పాటించాలని, తాజా పరిస్థితుల కోసం గూగుల్ మ్యాప్స్ వంటి నావిగేషన్ యాప్లను ఉపయోగించాలని సూచించారు. పనులు పూర్తయ్యే వరకు నగరవాసులు సహకరించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు