హైదరాబాద్: బ్రాండెడ్ వస్తువుల పేరుతో నకిలీ దందా సాగిస్తున్న ముఠాపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దోమల నివారణకు వాడే పాపులర్ బ్రాండ్ ‘గుడ్నైట్’ పేరుతో డూప్లికేట్ లిక్విడ్ రీఫిల్స్ను విక్రయిస్తున్న కేంద్రాలపై దాడులు చేసి భారీగా స్టాక్ను సీజ్ చేశారు.
జాయింట్ ఆపరేషన్
గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL) ప్రతినిధులు ఇచ్చిన రహస్య సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. నగరంలోని జాంబాగ్లో ఉన్న ఒక హోల్సేల్ పంపిణీ కేంద్రంపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ మెరుపు దాడిలో అసలైన గుడ్నైట్ ఉత్పత్తులను పోలి ఉన్న సుమారు 3,600 నకిలీ రీఫిల్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చట్టపరమైన చర్యలు
నకిలీ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు పాల్పడుతున్న నిందితులపై కాపీరైట్ యాక్ట్ భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నకిలీ వస్తువుల సరఫరా ఎక్కడి నుంచి జరుగుతోంది? ఇతర రాష్ట్రాలకు ఏమైనా లింకులు ఉన్నాయా? అనే దిశగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి నకిలీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా గోద్రెజ్ కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తక్కువ ధరకు వస్తున్నాయని నకిలీ ఉత్పత్తులను కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. నకిలీ కెమికల్స్ వాడటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. వస్తువులు కొనేటప్పుడు తప్పనిసరిగా పక్కా రసీదు (Bill) అడగాలని, అనుమానం వస్తే కంపెనీకి ఫిర్యాదు చేయాలని కోరారు.


