పశ్చిమాసియా ఉద్రిక్తతలపై సీఎంలతో ప్రధాని సమావేశం .. దేశ భద్రత, ఇంధన సరఫరాపై కీలక చర్చలు

పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దేశంపై పడే ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. ఇంధన భద్రత, భారతీయుల రక్షణ ప్రధాన అంశాలుగా చర్చించ

PM Modi to interact with CMs

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ శుక్రవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరగనుంది. యుద్ధం వల్ల దేశంపై పడే ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ చర్చలు జరుగనున్నాయి.

చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతుండటం గమనార్హం. అయితే దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో స్పష్టం చేసింది.

యుద్ధం వల్ల ఇబ్బందులు

ఇదే అంశంపై ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఇంధన భద్రతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌లోకి అన్నా కొనిదెల ఎంట్రీ… ‘అన్నయ్యనా? బావగారునా?’ పోస్ట్ వైరల్

పార్లమెంట్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ యుద్ధం వల్ల ఏర్పడుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. “ప్రస్తుతం యుద్ధం తీవ్రమైన ఇంధన సంక్షోభానికి దారితీస్తోంది. వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువుల సరఫరాపై ప్రభావం పడుతోంది” అని ఆయన తెలిపారు.

కేంద్రం తీసుకుంటున్న చర్యలు

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల భద్రత కూడా ప్రధాన అంశంగా మారింది. లక్షల సంఖ్యలో భారతీయులు అక్కడ ఉపాధి పొందుతుండటంతో వారి రక్షణపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అలాగే హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన నౌకల్లో భారతీయ సిబ్బంది ఉండటం మరో ఆందోళనగా మారింది.

ఇప్పటికే యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు సుమారు 4.25 లక్షల మందిని స్వదేశానికి తరలించినట్లు సమాచారం. ఇరాన్ నుంచి వచ్చిన వారిలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు.

సీఎంల సమావేశంలో కీలక చర్చలు

ఈ నేపథ్యంలో సీఎంలతో జరగనున్న సమావేశంలో రాష్ట్రాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సరఫరా వ్యవస్థను నిలబెట్టే చర్యలు, అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండే విధానాలపై ప్రధాని మోదీ సూచనలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సమావేశం దేశ ఆర్థిక, భద్రతా పరమైన కీలక నిర్ణయాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

About Author:

Mahesh Trellis

మహేష్ ట్రెల్లిస్ తెలుగు డిజిటల్ మీడియాలో 12 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్ట్‌. తెలంగాణ రాజకీయాలు, హైదరాబాద్ నగర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు మరియు ప్రజా సమస్యలపై ప్రత్యేకంగా వార్తలు రాస్తున్నారు. సాక్షి, 10టీవీ, మ్యాంగో న్యూస్ వంటి…

More About Author »