గురుగ్రామ్లో ప్రేమ పేరుతో సహజీవనం చేస్తున్న 19 ఏళ్ల యువతిపై ప్రియుడు దారుణంగా దాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడిగినందుకు ఆమెను గదిలో బంధించి, ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించి మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. ప్రస్తుతం బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది.
హర్యానాలోని గురుగ్రామ్ Gurugramలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై సహజీవనం చేస్తున్న యువతిపై యువకుడు అమానుషంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపుతోంది. త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్లో బయోటెక్నాలజీ విద్యను అభ్యసిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్లో ఒక డేటింగ్ యాప్ ద్వారా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల శివం అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, ఇద్దరూ కలిసి గురుగ్రామ్ సెక్టార్-69లోని ఒక ఫ్లాట్లో సహజీవనం ప్రారంభించారు.
పెళ్లి మాటే కలహానికి కారణం
ఫిబ్రవరి 19న పెళ్లి విషయంపై వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యువతి పెళ్లి గురించి పట్టుబడడంతో ఆగ్రహానికి గురైన శివం, ఆమెను గదిలో బంధించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.అంతేకాకుండా మెటల్ బాటిల్తో Metal Bottle తలపై దాడి చేసి, ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తరువాత కత్తితో కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు సమాచారం. మూడు రోజుల పాటు ఆమెను గదిలోనే నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడని పోలీసులు వెల్లడించారు.
తీవ్ర గాయాలతో నరకయాతన అనుభవించిన యువతి, చివరకు ధైర్యం చేసి తన తల్లికి ఫోన్ చేసి జరిగిన దారుణాన్ని వివరించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలిని గురుగ్రామ్లోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి Safdarjung Hospital కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు శివంను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. హత్యాయత్నం, అత్యాచారం, అక్రమ నిర్బంధం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని, పూర్తి మెడికల్ రిపోర్టులు వచ్చిన తర్వాత మరిన్ని కఠిన సెక్షన్లు చేర్చే అవకాశముందని గురుగ్రామ్ డీసీపీ తెలిపారు.
