CM Revanth Reddy | యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన బండి భగీరథ్ పోక్సో కేసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భగీరథ్ లొంగిపోలేదని, తామే అరెస్టు చేశామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నడిరోడ్డుపై దొరికితే అరెస్టు కాక సరెండర్ అవుతదా..? అని సీఎం ప్రశ్నించారు. బండి భగీరథ్ను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. మా పోలీసు సిబ్బంది చెప్పిందే నేను నమ్ముతున్నాను. ఒక వేళ సరెండర్ చేస్తే వాళ్ల పిల్లవాన్ని వాళ్ల ఇంట్లో పెట్టుకుని పోలీసులను పిలిపించి అప్పజెప్పుతరు. అప్పా జంక్షన్ నీ ఇళ్లా.. నా ఇళ్లా..? అప్పా జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే ఇక్కడ మా అబ్బాయి ఉన్నడు సరెండర్ చేసుకోండి అని చెబితే అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో అతన్ని కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేశామని పోలీసులు చెబుతుంటే.. నేను పోలీసుల మాట నమ్మల్నా.. రాజకీయ నాయకుల మాటలు నమ్మాల్నా..? అని ప్రశ్నించారు. అతను దగ్గరుండే పంపించి ఉండొచ్చు. అతను ఏది చెబితే అదే నిజం. ఈ కేసులో ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. మా చర్యలను ప్రజలు కానీ, కోర్టు కానీ ఎవరూ తప్పుపట్టలేదు’ అని సీఎం పేర్కొన్నారు.
Read Also : తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం.. నిజామాబాద్లో అత్యధికంగా 45.7 డిగ్రీలు..
ప్రతిపక్ష నేత ఎక్కడున్నడు..?
ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకున్నాడు..? అని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పోక్సో కేసుపై ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. లేడీకి లేచిందే పరుగు అనుకున్నట్టు కేటీఆర్ వ్యవహారశైలి ఉంది. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటున్నడు. వాళ్ల నాన్న దిగిపోయి చాలా రోజులైంది. వాళ్ల నాన్న ఫామ్హౌస్లో పడుకుండు అని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ల నాన్న ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. బయటకు వచ్చి మాట్లాడడానికి శక్తి లేకపోయినా ప్రెస్నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా..? పక్క పార్టీవోడు వస్తేనేమో జగిత్యాల పోయి వస్తడు.. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు..? స్పందించడా..? ఆయనకు బాధ్యత లేదా..? ఆ బాధిత కుటుంబానికి ప్రతిపక్ష నాయకుడు అండగా నిలబడాలి కదా..? పదేండ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ అధికారంలో ఉంటేనే బయటకు వస్తావా..? అధికారంలో లేకపోతే బయటకు రావా..? అని మీరు ఎవరైనా అడిగారా..? ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే బంట్రోతులనైనా అడగండి అని సీఎం రేవంత్ సూచించారు.
Read Also : కాళేశ్వరంలో రేపటి నుంచే సరస్వతీ పుష్కరాలు.. ఏర్పాట్లు సిద్ధం చేసిన తెలంగాణ సర్కారు..
పోక్సో కేసులో కేటీఆర్ జడ్జి..
బండి భగరీథ్పై నమోదైన పోక్సో కేసులో కేటీఆర్ జడ్జిగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవోగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈయన విచారణ చేసిండు.. ఆయన శిక్ష విధించిండు.. ఎంత సిగ్గు తప్పి పోయారంటే అసలు నాకు అర్థమే ఐతలేదు అని రేవంత్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, పోలీసులకు చట్టాలు ఉన్నాయి. ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ చేసినం.. పేరెంట్స్ స్టేట్మెంట్ తీసుకున్నాం. పోక్సో కేసులో ఎవరి వివరాలు చెప్పడానికి లేదు. వాళ్లలాగా రోడ్డు మీద పడి మాట్లాడితే ఆ అమ్మాయి కుటుంబానికి ఎంత ఆవేదన ఉంటది. ఆ అమ్మాయి, తల్లిదండ్రుల ఫొటోలు అడ్డగోలుగా పెట్టారు. కేటీఆర్ మనిషా..? ఎవడన్న మనిషి ఇట్ల వ్యవహరిస్తాడ? రాజకీయాలు కావాలనుకుంటే ఎన్నికల్లో కొట్లాడు. ఎన్నికల్లో ఓడించు. రాజకీయాలను రాజకీయాల్లాగా, సమస్యను సమస్యలాగా చూడాలి. మైనర్కు సబంధించిన దానికి రాజకీయాలు ఎందుకు..? ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకుంటున్నప్పటికీ, రాజకీయంగా ఏదో సాధించామని ఈ శాడిజం ఏంది..? ఇది శాడిస్టిక్ ప్లెజర్ కాదా..? అంటూ సీఎం రేవంత్ ఘాటుగా స్పందించారు.
Read Also : మద్యం ప్రియులకు షాక్ ఇవ్వబోతున్న సర్కారు.. జూన్ నుంచి ధరల పెంపు..!


